* ప్రపంచవ్యాప్త విధాన రూపకర్తలకు, సీఈఓలకు, పరిశ్రమ రంగ నేతలకు వ్యాపారం, సహకారం, భాగస్వామ్యాల బలమైన వేదికగా భారత్ టెక్స్: ప్రధాని
* ఇది మా సాంప్రదాయక దుస్తుల మాధ్యమం ద్వారా భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెబుతోంది: ప్రధాని
* కిందటేడాది భారత వస్త్రాలు, దుస్తుల ఎగుమతుల్లో 7 శాతం వృద్ధి.. ప్రస్తుతం ప్రపంచంలో వస్త్రాలు, దుస్తుల ఆరో అతి పెద్ద ఎగుమతిదారు భారతే: ప్రధాని
* చేయి తిరిగిన కార్మికులుంటే ఏ రంగమైనా రాణిస్తుంది.. వస్త్ర పరిశ్రమలో నైపుణ్యానిదే కీలక పాత్ర: ప్రధాని
* టెక్నాలజీ యుగంలో చేనేత కళ ప్రామాణికతను కాపాడుకోవడం ముఖ్యం: ప్రధాని
* ఫ్యాషన్ జగతిలో పర్యావరణానికి, సాధికారతకు పెద్దపీట వేస్తున్న ప్రపంచం.. ఈ మార్గంలో భారత్ ముందుండి నాయకత్వం వహించగలుగుతుంది: ప్రధాని
* ‘ఫాస్ట్ ఫ్యాషన్ వేస్ట్’ను ఒక అవకాశంగా మార్చుకోగల శక్తి భారత వస్త్ర పరిశ్రమకు ఉంది.. టెక్స్‌టైల్ రీసైక్లింగ్, అప్-సైక్లింగ్ ప్రక్రియల్లో భారత్‌కున్న విభిన్న సాంప్రదాయక నైపుణ్యాలే ఈ అంశంలో వెన్నుదన్ను: ప్రధాని

న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ‘భారత్ టెక్స్ 2025’ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను కూడా ఆయన పరిశీలించారు. సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరికీ భారత్ టెక్స్‌కు ఆహ్వానం పలుకుతున్నానన్నారు. ఈ రోజు భారత్ మండపంలో భారత్ టెక్స్ రెండో సంచికను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం మా దేశ సంప్రదాయాలను కళ్లకు కట్టడంతోపాటు వికసిత్ భారత్ సాధనకు ఉన్న అవకాశాలను కూడా చాటుతోందని, ఇది ఇండియాకు గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ‘‘భారత్ టెక్స్ ఇక మెగా గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్‌గా ఎదుగుతోంది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు. వేల్యూ చైన్‌లో పాత్రధారులైన మొత్తం 12 సముదాయాలు ఈసారి ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నాయని కూడా ఆయన తెలిపారు. దుస్తులు, అనుబంధ వస్తువులు (ఏక్సెసరీస్), యంత్ర పరికరాలు, రసాయనాలు, అద్దకం రంగులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్న సంగతిని ఆయన ప్రస్తావించారు. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన విధాన రూపకర్తలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓలు), పరిశ్రమ నేతలకు వ్యాపారానికి, సహకారానికి, భాగస్వామ్యాల్ని ఏర్పరచుకోవడానికి ఒక బలమైన వేదికగా భారత్ టెక్స్ మారుతోందని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పాటును అందిస్తున్న ఆసక్తిదారులందరి కృషిని ఆయన ప్రశంసించారు.

‘‘భారత్ టెక్స్‌లో ప్రస్తుతం 120 కన్నా ఎక్కువ దేశాలు పాల్గొంటున్నాయి’’ అని శ్రీ మోదీ తెలిపారు. అంటే సరుకును ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్క సంస్థ (ఎగ్జిబిటర్)కు 120కి పైగా దేశాలతో వ్యాపారావకాశాలు లభించవచ్చన్నమాటే, దీంతో వారు తమ వ్యాపారాల్ని దేశీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి విస్తరించగలుగుతారని ఆయన వివరించారు. కొత్త విపణులను వెతుకుతున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వివిధ గ్లోబల్ మార్కెట్లకు సాంస్కృతికంగా ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలుసుకొనే వీలు కూడా చిక్కుతోందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనలో తాను కలియ దిరిగిన విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకొంటూ, అనేక స్టాళ్లను తాను చూడడంతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున కొత్త కొనుగోలుదారులను కలుసుకొంటున్నామని, వ్యాపారాలను విస్తరించడానికి అవకాశాలు లభిస్తున్నాయని స్టాళ్ల నిర్వాహకులు తనతో చెప్పారని ప్రధాని అన్నారు. పెట్టుబడులు, ఎగుమతులతోపాటు యావత్తు వస్త్ర రంగం వృద్ధికి ఈ ఈవెంట్ ఎంతగానో దోహదం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వస్త్రరంగంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారి వ్యాపారాలను పెంచుకొని, ఆ క్రమంలో అదనపు అవకాశాలను అందుకొంటూ ఉపాధిని కల్పించడానికి వీలుగా వారి అవసరాలను తీర్చాల్సిందిగా బ్యాంకింగ్ రంగానికి శ్రీ మోదీ  విజ్ఞప్తి చేశారు.
 

‘‘మా సంప్రదాయ దుస్తుల రూపంలో భారతదేశంలోని సాంస్కృతిక భిన్నత్వానికి భారత్ టెక్స్ అద్దంపడుతోంది’’ అంటూ ప్రధానమంత్రి అభివర్ణించారు. తూర్పు నుంచి పశ్చిమం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు.. మా దేశంలో సంప్రదాయ వస్త్రధారణలో అనేక సరళులు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా లఖ్‌నవీ చికన్‌కారీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని బాంధ్‌నీ, గుజరాత్‌కు చెందిన పటోలా, వారణాసికి చెందిన బనారసీ పట్టు, దక్షిణాదిన కాంజీవరమ్ పట్టు, జమ్మూ కాశ్మీరుకు చెందిన పశ్మీనా.. ఇలా వేరు వేరు రకాల వస్త్రాలను గురించి వివరించారు. మన వస్త్ర పరిశ్రమ వైవిధ్యాన్ని, అద్వితీయతను ప్రోత్సహించడానికి, ఈ పరిశ్రమ స్థాయిని శ్రద్ధతో పెంచుకోవడానికి ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని స్పష్టం చేశారు.

కిందటి ఏడాది వస్త్ర పరిశ్రమలో అయిదు అంశాలను గురించి తాను ప్రముఖంగా ప్రస్తావించిన సంగతిని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చారు. అవి.. ఫారం, ఫైబర్, ఫ్యాబ్రిక్, ఫ్యాషన్, ఫారిన్‌లు.. అని ఆయన అన్నారు. ఈ దృష్టికోణం భారత్‌కు ఒక ఉద్యమ రూపాన్ని సంతరించుకొనేందుకు తోడ్పడిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇది రైతులకు, నేతకారులకు, డిజైనర్లకు, వ్యాపారులకు కొత్త వృద్ధి బాటలను అందుబాటులోకి తెస్తోందని ఆయన అన్నారు. ‘‘గత సంవత్సరంలో భారత్ వస్త్రాలు, దుస్తుల ఎగుమతుల్లో 7 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతం ప్రపంచంలో వస్త్రాలను, దుస్తులను బాగా ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ ఆరో స్థానంలో ఉంది’’ అని ఆయన తెలిపారు. భారత వస్త్ర ఎగుమతులు రూ.3 లక్షల కోట్ల స్థాయిని అందుకొన్నాయి. 2030కల్లా దీనిని రూ.9 లక్షల కోట్లకు పెంచడం లక్ష్యమని ఆయన చెప్పారు.
 

వస్త్ర రంగంలో లభించిన ఈ విజయం పదేళ్లుగా అదేపనిగా అనేక ప్రయత్నాలు చేస్తూ, విధానాలను ప్రవేశపెడుతూ వచ్చిన దాని ఫలితమని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు గడచిన దశాబ్ద కాలంలో రెట్టింపు అయ్యాయని ఆయన తెలిపారు. ‘‘మా దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను సమకూరుస్తున్న పరిశ్రమల్లో వస్త్ర పరిశ్రమ ఒకటి, ఇది భారత తయారీ రంగానికి 11 శాతం తోడ్పాటును అందిస్తోంది’’ అని ఆయన వివరించారు. తాజా బడ్జెటులో మిషన్ మాన్యుఫాక్చరింగును ప్రకటించాం అని ఆయన అన్నారు. ఈ రంగంలోకి వచ్చిన పెట్టుబడులతో, ఈ రంగంలో చోటు చేసుకొన్న వృద్ధితో కోట్లాది వస్త్ర పరిశ్రమ కార్మికులకు మేలు కలుగుతోందని ప్రధాని చెప్పారు.

భారత వస్త్ర రంగం సవాళ్లను పరిష్కరించడానికి, ఈ రంగానికున్న సామర్థ్యాన్ని సద్వినియోగపరుచుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని శ్రీ మోదీ స్పష్టం చేశారు. గత పదేళ్లుగా చేస్తూ వచ్చిన కృషి, రూపొందిస్తూ వచ్చిన విధానాలు ఈ సంవత్సరం బడ్జెటులోనూ చోటుచేసుకొన్నాయని ఆయన చెప్పారు. పత్తి సరఫరాలో ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా చూడడానికి, భారత పత్తిని ప్రపంచ దేశాలతో పోటీపడేటట్టుగా తీర్చిదిద్దడానికి, వేల్యూ చైనును బలపరచడానికి ‘మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’ని ప్రకటించామని ప్రధాని వివరించారు. టెక్నికల్ టెక్స్‌టైల్స్ వంటి వృద్ధికి అవకాశం ఉన్న రంగాలపై దృష్టిని కేంద్రీకరించే, దేశవాళీ కార్బన్ ఫైబరును, దానితో తయారు చేసే ఉత్పాదనలను ప్రోత్సహించే దిశగా భారత్ ముందంజ వేస్తోందని శ్రీ మోదీ చెప్పారు. దీనికి అదనంగా, వస్త్ర రంగానికి అవసరమైన విధాన నిర్ణయాలను కూడా తీసుకొంటున్నామని ప్రధానమంత్రి తెలిపారు. ఈ బడ్జెటులో ఎంఎస్ఎంఈల వర్గీకరణ ప్రమాణాలను విస్తరించినట్లు, రుణ లభ్యతను పెంచినట్లు ఆయన ప్రధానంగా చెప్పారు. ఎంఎస్ఎంఈల నుంచి 80 శాతం మద్దతును పొందే వస్త్ర రంగానికి ఈ చర్యలు అనేక ప్రయోజనాలను అందించనున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు.
 

‘‘ఏ రంగంలో అయినా చేయితిరిగిన కార్మికులు ఉన్నప్పుడు ఆ రంగం రాణిస్తుంది, మరి నైపుణ్యం అనేది వస్త్ర పరిశ్రమలో కీలక పాత్రను పోషిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు. ఆరితేరిన ప్రతిభావంతుల సమూహాలను తయారు చేయడానికి కావలసిన ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెబుతూ, నైపుణ్యాలకు పదును పెట్టడానికి జాతీయ ఉత్కృష్టత కేంద్రాల పాత్ర ముఖ్యమన్నారు. వేల్యూ చైనును దృష్టిలో పెట్టుకొని అవసరమైన ప్రావీణ్యాలను అందించడంలో సమర్థ్ స్కీము సాయపడుతోందని ఆయన తెలిపారు. ఈ టెక్నాలజీ యుగంలో చేనేత పనితనం ప్రామాణికత్వాన్ని పరిరక్షించుకోవడానికి ప్రాధాన్యాన్నివ్వాలని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. చేనేతకారులకు నైపుణ్యాలను, అవకాశాలను పెంచి వారు తయారుచేస్తున్న ఉత్పాదనలను ప్రపంచ దేశాల్లోని విపణులకు చేర్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన తెలిపారు. ‘‘గత పదేళ్లలో, చేనేతలను ప్రోత్సహించడానికి 2400కు పైగా విస్తృత స్థాయి మార్కెటింగ్ ప్రధాన కార్యక్రమాలను నిర్వహించారు’’ అని ప్రధాని అన్నారు. చేనేత ఉత్పాదనలను ఆన్‌లైన్ మాధ్యమం సాయంతో విక్రయించడానికి ఒక ఎలక్ట్రానిక్ వాణిజ్య వేదిక (ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం)ను అందుబాటులోకి తీసుకువచ్చారని, వేలాది చేనేత బ్రాండులు దీనిలో నమోదయ్యాయని కూడా ఆయన తెలిపారు. చేనేత ఉత్పాదనలకు జీఐ గుర్తింపు లభించినందువల్ల కలిగిన ప్రధాన ప్రయోజనాలను గురించి కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

గతేడాది జరిగిన భారత్ టెక్స్ కార్యక్రమంలో స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ ప్రారంభించి, వస్త్ర రంగంలో ఎదురవుతున్న సమస్యలకు యువత నుంచి వినూత్నమైన, సుస్థిరమైన పరిష్కారాలను ఆహ్వానించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువత ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని, గెలుపొందిన వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని వెల్లడించారు. ఈ యువ ఆవిష్కర్తలకు తోడ్పాటునిచ్చేందుకు సిద్ధంగా ఉన్న అంకుర సంస్థలను సైతం ఆహ్వానించామని తెలిపారు. దేశంలో అంకుర సంస్థల సంస్కృతిని పెంచే పిచ్ ఫెస్ట్ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, ప్రైవేటు వస్త్రరంగంలోని ప్రముఖ సంస్థలు అందిస్తున్న మద్ధతును ఆయన ప్రస్తావించారు. కొత్త టెక్నో - టెక్స్‌టైల్ స్టార్టప్‌లను ముందుకు తీసుకురావాలని, కొత్త ఆలోచనలపై పనిచేయాలని యువతను శ్రీ మోదీ ప్రోత్సహించారు. నూతన పరికరాలను అభివృద్ధి చేయడానికి ఐఐటీలతో కలసి పనిచేయాలని వస్త్ర రంగ పరిశ్రమలకు ఆయన సూచించారు. కొత్త తరానికి చెందినవారు ఆధునిక ఫ్యాషన్ పోకడలతో పాటు సంప్రదాయ దుస్తులను సైతం ఇష్టపడటాన్ని తాను గమనించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త తరాన్ని ఆకర్షించేందుకు సంప్రదాయాన్ని వినూత్నతతో మేళవించి వస్త్రాలను రూపొందించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. కొత్త ఫ్యాషన్ పోకడలను రూపొందించడంలో పెరుగుతున్న టెక్నాలజీ పాత్రను, కొత్త శైలిని సృష్టించడంలో ఏఐ పోషిస్తున్న పాత్ర గురించి ప్రధానమంత్రి చర్చించారు. సంప్రదాయ ఖాదీని ప్రోత్సహిస్తూనే, ఫ్యాషన్ పోకడలను కృత్రిమ మేధ సాయంతో విశ్లేషించాలని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను పనిచేస్తున్న సమయంలో పోర్‌బందర్లో ఖాదీ ఉత్పత్తులతో నిర్వహించిన ఫ్యాషన్ షోను ఆయన గుర్తు చేసుకున్నారు. ఖాదీని ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యం గురించి వివరిస్తూ, స్వాతంత్ర సాధనకు ‘దేశం కోసం ఖాదీ’ అన్నారని ఇప్పుడు దాన్ని ‘ఫ్యాషన్ కోసం ఖాదీ’ గా మార్చాలన్నారు.

 

ప్రపంచ ఫ్యాషన్ రాజధానిగా పేరొందిన ప్యారిస్‌కు ఇటీవల తాను వెళ్ళినప్పుడు వివిధ అంశాల్లో రెండు దేశాల మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందాల గురించి వివరించారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, ఫ్యాషన్‌ను సైతం ప్రభావితం చేసే సుస్థిర జీవనశైలి ప్రాధాన్యతను ప్రపంచవ్యాప్తంగా అర్థం చేసుకోవడం సహా వివిధ అంశాలపై జరిగిన చర్చల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘పర్యావరణం, సాధికారత కోసం ఫ్యాషన్ అనే సూత్రాన్ని ప్రస్తుత ప్రపంచం స్వీకరిస్తోంది. దీనికి భారత్ నాయకత్వం వహించగలదు’’ అని ప్రధానమంత్రి అన్నారు. భారతీయ టెక్స్‌టైల్ సంప్రదాయంలో సుస్థిరత సమగ్ర భాగమన్న ఆయన ఈ విషయంలో ఖాదీ, గిరిజన వస్త్రాలు, సహజమైన రంగులను ఉదాహరణలుగా చూపించారు. భారతీయ సంప్రదాయ సుస్థిర పద్ధతులు ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో మెరుగవుతున్నాయి. తద్వారా ఈ రంగంలో పనిచేస్తున్న కళాకారులకు, నేత కార్మికులకు, మహిళలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

వనరులను గరిష్ఠ స్థాయిలో సమర్థంగా వినియోగించుకుంటూ, వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించాల్సిన ప్రాధాన్యతను ప్రధానమంత్రి వివరించారు. నెలనెలా ఫ్యాషన్ మారుతున్న నేపథ్యంలో లక్షల సంఖ్యలో వస్త్రాలను పారవేస్తున్న ‘ఫాస్ట్ ఫ్యాషన్ వేస్ట్’ సమస్య గురించి ప్రస్తావిస్తూ ఇది పర్యావరణానికి, జీవావరణానికి పెనుముప్పుగా పరిణమించనుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి ఫ్యాషన్ వ్యర్థాలు 148 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని అన్నారు. ప్రస్తుతం వస్త్ర వ్యర్థాల్లో పావు వంతు కంటే తక్కువే రీసైక్లింగ్ అవుతున్నాయని తెలిపారు. భారతీయ వస్త్ర పరిశ్రమ ఈ సమస్యను అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. దేశంలో వైవిధ్యమైన సంప్రదాయ నైపుణ్యాలను వినియోగించుకొని రీసైక్లింగ్, అప్‌సైక్లింగ్ చేయాలని అన్నారు. పాత, మిగిలిపోయిన వస్త్రాలతో చాపలు, రగ్గులు తయారుచేయవచ్చని, చిరిగిపోయిన వస్త్రాలనుంచి మహారాష్ట్రలో క్విల్టులు రూపొందిస్తున్నారని ఈ సందర్భంగా శ్రీ మోదీ తెలియజేశారు. సంప్రదాయ కళల్లో ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని అన్నారు. అప్‌సైక్లింగ్‌ను, అప్‌సైక్లింగ్ చేసేవారిని ప్రోత్సహించేందుకు జౌళి మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, ఈ-మార్కెట్‌ప్లేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నవీ ముంబయి, బెంగళూరులో ఇంటింటికీ వెళ్లి వస్త్ర వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని, అవకాశాలను అన్వేషించి, ప్రపంచ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచే దిశగా ముందుగానే చర్యలు తీసుకోవాలని అంకుర సంస్థలను ప్రోత్సహించారు. రానున్న కాలంలో భారతీయ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన రీసైక్లింగ్ మార్కెట్ 400 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, అదే సమయంలో ప్రపంచ మార్కెట్ 7.5 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు. సరైన దిశలో వెళితే ఈ మార్కెట్లో పెద్ద వాటాను భారత్ కైవసం చేసుకోగలుగుతుందని తెలిపారు.
 

కొన్ని శతాబ్ధాల క్రితం, సంక్షేమం విషయంలో భారత్ అత్యున్నత దశలో ఉన్న సమయంలో వస్త్ర పరిశ్రమ కీలకపాత్ర పోషించిందని తెలిపారు. వికసిత్ భారత్ దిశగా మన దేశం ముందుకు వెళుతున్న ఈ తరుణంలో వస్త్ర రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. భారత్ టెక్స్ తరహా కార్యక్రమాలు ఈ రంగంలో భారత్ స్థాయిని బలోపేతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ప్రతి ఏడాదీ రికార్డు స్థాయిలో విజయాలు సొంతం చేసుకొని, నూతన శిఖరాలను అధిరోహిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ పబిత్ర మార్గరీటాతో సహా ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు భారత్ మండపంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ కార్యక్రమమే భారత్ టెక్స్ 2025. వస్త్రరంగంలో విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో ముడి పదార్థాల నుంచి తుది ఉత్పత్తుల వరకు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో ఇది ప్రత్యేకతను సొంతం చేసుకుంది.

భారత్ టెక్స్ వేదిక వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అతి పెద్ద, విస్తృత కార్యక్రమం. రెండు వేదికల్లో నిర్వహించే  ఈ కార్యక్రమం యావత్ వస్త్ర పరిశ్రమను కళ్ళకు కడుతుంది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో 70 వరకు సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్యానెల్ చర్చలు, శిక్షణా తరగతులు కూడా జరుగుతాయి. ప్రత్యేక ఆవిష్కరణలను, అంకుర సంస్థలను ప్రదర్శించే వేదికలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిలో స్టార్టప్ పిచ్ ఫెస్ట్ ఆధారిత హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఫెస్ట్‌లు, టెక్ ట్యాంకులు, డిజైన్ ఛాలెంజ్‌ల ద్వారా వివిధ అంకుర సంస్థల్లో ప్రముఖ పెట్టుబడిదారులు పెట్టుబడులు అవకాశం కల్పిస్తుంది.
 

 

భారత్ టెక్స్ 2025లో 120కి పైగా దేశాల నుంచి విధాన రూపకర్తలు, అంతర్జాతీయ సంస్థల సీఈవోలు, 5000కు పైగా ప్రదర్శనకారులు, 6000కు పైగా అంతర్జాతీయ స్థాయి కొనుగోలు దారులు పాల్గొంటారు. ఇంటర్నేషనల్ టెక్స్‌టైల్ మాన్యుఫాక్చరర్స్ ఫెడరేషన్ (ఐటీఎంఎఫ్), ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ (ఐసీఏసీ), యూరాటెక్స్, టెక్స్‌టైల్ ఎక్స్ఛేంజి, యూఎస్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ (యూఎస్ఎఫ్ఐఏ) సహా 25కి పైగా ప్రముఖ అంతర్జాతీయ వస్త్ర సంస్థలు, సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Pyaaz Khaate Hai, Dimaag Nahi': PM Modi's Jhalmuri Video Breaks The Internet With 100M+ Views

Media Coverage

Pyaaz Khaate Hai, Dimaag Nahi': PM Modi's Jhalmuri Video Breaks The Internet With 100M+ Views
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings to all civil servants on Civil Services Day
April 21, 2026

The Prime Minister, Shri Narendra Modi extended greetings to all civil servants on Civil Services Day, today. Shri Modi remarked that this is an occasion to further strengthen the resolve to work towards good governance and nation building. "From the grassroots to policy-making, the efforts of civil servants touch countless lives and contribute to India’s progress. May our civil servants continue to serve with excellence, compassion and innovation, upholding the highest standards of duty", Shri Modi said.

Shri Modi posted on X:

"Greetings to all civil servants on Civil Services Day. This is an occasion to further strengthen the resolve to work towards good governance and nation building. From the grassroots to policy-making, the efforts of civil servants touch countless lives and contribute to India’s progress. May our civil servants continue to serve with excellence, compassion and innovation, upholding the highest standards of duty."