రూ. 35,440 కోట్లతో వ్యవసాయ రంగంలో రెండు ప్రధాన పథకాలకు నాంది సందర్భం
దీర్ఘకాల ప్రభావాన్ని చూపగల వ్యవసాయ పద్ధతులు
దేశమంతటా రైతులకు ఆదర్శంగా నిలుస్తాయి: ప్రధానమంత్రి
పప్పు ధాన్యాల సాగుతో రైతులకు అధిక ఆదాయంతో పాటు

న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)లో ఈ రోజు ఒక వ్యవసాయ ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా రైతులతో ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ మాట్లాడారు. రైతుల సంక్షేమం, వ్యవసాయంలో స్వయంసమృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనను బలపరిచే దిశగా ప్రధానమంత్రి కనబరుస్తున్న నిరంతర నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది.  శ్రీ మోదీ ఒక సార్వజనిక కార్యక్రమంలో పాల్గొని, వ్యవసాయ రంగంలో రూ.35,440 కోట్ల ఖర్చుతో రెండు ప్రధాన పథకాలను ప్రారంభించారు. అంతకు ముందు, రైతులతో ఆయన సంభాషించారు. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ  పథకానికి రూ.24,000 కోట్లు ఖర్చు చేస్తారు. ‘మిషన్ ఫర్ ఆత్మనిర్భర్‌తా ఇన్  పల్సెస్’ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ పథకానికి రూ.11,440 కోట్లు ఖర్చు చేస్తారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య పరిశ్రమ, ఆహార శుద్ధి రంగాల్లో రూ.5,450 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో సంకల్పించిన మరికొన్ని ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. వీటికి అదనంగా, సుమారు రూ.815 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఇతర ప్రాజెక్టులకు ప్రధానమంత్రి  శంకుస్థాపన చేశారు.

హర్యానాలోని హిసార్‌ జిల్లాకు చెందిన రైతుల్లో ఒక రైతు కాబూలీ శెనగ సాగుతో తన వ్యవసాయ జీవనాన్ని ఆరంభించారు. ఆయన తన అనుభవాన్నీ, లోతైన ఆలోచనలనూ ప్రధానమంత్రితో పంచుకున్నారు. నాలుగేళ్ల  కిందట తాను కాబూలీ శెనగ పండించడం మొదలుపెట్టి, ప్రస్తుతం ఎకరాకు దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నట్లు ఆ రైతు చెప్పారు. అంతర పంటల పద్ధతిని అనుసరిస్తున్నారా? అంటూ ప్రధానమంత్రి ఆ రైతును అడిగారు. ముఖ్యంగా భూసారాన్ని పెంచడానికీ, అదనపు ఆదాయాన్ని సంపాదించడానికీ పప్పు ధాన్యాల పంటలను వ్యవసాయ వ్యవస్థలో చేర్చవచ్చా అని ప్రధానమంత్రి వాకబు చేశారు.
 

దీనికి రైతు బదులిస్తూ, అలాంటి పంటలను వేయడం లాభసాటిగా రుజువైందన్నారు. శెనగల వంటి పప్పు ధాన్యాలను సాగు చేయడం ద్వారా నమ్మకమైన పంటను అందించడం మాత్రమే కాకుండా, నేలను నత్రజనితో సమృద్ధం చేయవచ్చని, ఇది ఆ తరువాత వేసే పంటల దిగుబడులను కూడా మెరుగుపరుస్తుందని చెప్పారు. భూమి స్వస్థతను పెంచి పోషించేలా, దీర్ఘకాల ప్రయోజనాన్నందించే పద్ధతిని తోటి రైతులను కూడా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.

ఈ కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ  పద్ధతులు దేశమంతటా ఇతర రైతులకు ఒక ఆదర్శంగా నిలుస్తాయిని ఆయన అన్నారు. రైతు తన కృతజ్ఞత‌లు తెలియజేస్తూ, ‘‘ప్రధానమంత్రితో భేటీ అయ్యే అవకాశం లభించడం నా జీవితంలో ఇదే మొదటి సారి. ఆయన సిసలైన నేత. రైతులతో, సామాన్య  పౌరులతో ఇట్టే కలిసిపోతారు’’ అన్నారు.

ఆ రైతు ‘కిసాన్ పదక్ సంస్థాన్’ (ఫార్మర్ మెడల్ ఆర్గనైజేషన్)తో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా పంచుకున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉంటూనే, రైతుగా కూడా చురుకుగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కుటుంబంలో తనకు దక్కిన 16 బీఘాల పొలంలో పప్పుధాన్యాలను పండిస్తున్నట్లు, తన గ్రామంలో 20 మంది మహిళలతో స్వయంసహాయ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ బృందాలు శెనగలతో తయారు చేసే ఉత్పాదనలు, వెల్లుల్లితో పాటు సాంప్రదాయక అప్పడాల వంటి విలువ జోడింపు  కార్యకలాపాల్లోనూ పాలుపంచుకుంటున్నాయనీ, గ్రామంలో ఔత్సాహిక పారిశ్రిమికత వృద్ధి చెందుతోందన్నారు. ‘‘మేం మా బ్రాండుకు ‘‘దుగారీ వాలే’’ అని పేరు పెట్టుకున్నాం. దుగారీ అనేది మా ఊరి పేరు. సర్. మేం దుగారీ వాలే శెనగలనూ, దుగారీ వాలే వెల్లుల్లినీ, దుగారీ వాలే అప్పడాలనూ అమ్ముతున్నాం. మేం జీఈఎమ్ పోర్టల్లో కూడా నమోదయ్యాం. అక్కడి నుంచి మా ఉత్పాదనలను సైన్య సిబ్బంది కొంటున్నారు’’ అని ఆ రైతు తెలిపారు. తమ  ఉత్పాదనలు ఒక్క రాజస్థాన్‌లోనే కాకుండా, భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో కూడా ఆదరణ పొందుతున్నాయని ఆయన చెప్పారు.
 

హర్యానాలోని హిసార్‌ జిల్లాకే చెందిన మరో రైతు కాబూలీ శెనగ పంటను సాగు గురించి చెప్పుకొచ్చారు. 2013-14 నుంచి  తాను ఈ  పంట వేస్తున్నానని ఆయన తెలిపారు. మొదట్లో ఒక ఎకరంలో ఈ పంటను వేసినట్లు, క్రమంగా 13-14 ఎకరాలకు పైగా విస్తరించినట్లు ఆయన చెప్పారు. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడంతో దిగుమడి అధికమవుతూ వచ్చిందని ఆయన తన విజయ రహస్యాన్ని పంచుకున్నారు. ‘‘ఆదాయం బాగా పెరిగింది. ప్రతి ఏటా మేం ఉత్తమ నాణ్యత కలిగిన గింజలను ఎంపిక చేసుకొంటాం.. ఫలసాయం కూడా పెరుగుతూ వస్తోంది’’ అని ఆ రైతు వివరించారు.

పప్పు ధాన్యాల పోషక విలువలను గురించి ముఖ్యంగా శాకాహారుల విషయంలో దీని ప్రాధాన్యాన్ని గురించి ప్రధానమంత్రి తెలిపారు. పప్పు ధాన్యాల సాగు రైతు ఆదాయం పెరగడమే కాకుండా దేశానికి పోషణ పరంగా భద్రతను పెంచడానికి కూడా తోడ్పడుతుందని ఆయన అన్నారు. చిన్న, సన్నకారు రైతులు కలిసికట్టుగా చొరవ తీసుకొని బృందాల వారీ సాగుకు నడుం బిగించాలనీ, వారి  పొలాలను కలిపేసుకొని, అధిక విలువనిచ్చే పంటలను ఎంపిక  చేసుకోవాలని శ్రీ మోదీ అన్నారు. ఇలా చేస్తే ఉత్పత్తి పెరగడం, ఖర్చు తగ్గడంతో పాటు మార్కెట్ల లభ్యత కూడా మెరుగుపడుతుందంటూ ఆయన రైతులను ప్రోత్సహించారు.

ఈ నమూనా విజయవంతమైనట్లు ఓ రైతు ఉదాహరణ పూర్వకంగా తెలిపారు. సుమారు 1200 ఎకరాల్లో ప్రస్తుతం ఎలాంటి అవశేషాలకూ తావు ఉండని రీతిన కాబూలీ శెనగ సాగు కొనసాగుతోందనీ, ఇది ఉత్తమమైన మార్కెట్ లభ్యతతో పాటు పూర్తి బృందానికి ఆదాయాన్ని ఇదివరకటి  కన్నాపెంచిందనీ ఆ రైతు వివరించారు.

సజ్జలు, జొన్నల వంటి చిరుధాన్యాల (శ్రీ అన్న) సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందనీ, మరీముఖ్యంగా నీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాల్లో వీటిని సాగు చేయాలని చెబుతోందనీ ప్రధానమంత్రి తెలిపారు. చిరుధాన్యాల సాగు అమలవుతోందనీ, మార్కెట్ అవసరాల మేరకు, ఆరోగ్య సంబంధిత అవగాహన సైతం వ్యాప్తి చెందుతుండడంతో ఈ పంటలకు ప్రజాదరణ నానాటికీ పెరుగుతోందనీ ఒక రైతు చెప్పారు. ‘‘నీటి కొరత ఉన్న చోట్ల, చిరుధాన్యాలు ప్రాణాధారం. చిరుధాన్యాలకు ప్రపంచ దేశాల్లో మార్కెట్ శరవేగంగా పెరుగుతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
 

ప్రాకృతిక వ్యవసాయంతో పాటు రసాయనాల జోలికి వెళ్లకుండా సాగు చేయడం అనే అంశం కూడా ఈ సంభాషణలో ప్రస్తావనకు వచ్చింది. అలాంటి పద్ధతులను చిన్న, సన్నకారు రైతులు మెల్లమెల్లగాను, ఆచరణపూర్వకంగాను అనుసరించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దశలవారీగా ముందుకు పోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఉన్న పొలంలో కొంత మేర ప్రాకృతిక వ్యవసాయానికి అనువైందేనా? అనేది పరీక్షించి చూడాలనీ, మిగతా పొలంలో సాంప్రదాయక సేద్యాన్నే కొనసాగించాలనీ, ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా ప్రోది చేసుకోవాలనీ ఆయన వివరించారు.

ఒక  స్వయంసహాయ బృందానికి చెందిన మహిళా రైతు 2023లో తాను ఆ బృందంలో చేరి, తన 5 బీఘాల పొలంలో పెసర్లను పండించడం మొదలుపెట్టినట్లు తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒక పెద్ద అండగా ఉందని ఆమె అన్నారు. పొలాన్ని నాట్లకు సిద్ధం చేసుకోవడంలో, విత్తనాలను కొనుగోలు చేయడంలో ఈ పథకం తనకు తోడ్పడినట్లు  చెప్పారు. ‘‘ఏటా రూ.6,000 సాయం చేయడం ఓ శుభాశీస్సే. మేం విత్తనాలను కొనుగోలు చేసి, సకాలంలో చల్లడంలో ఈ  పథకం సాయపడుతోంది’’ అని ఆమె అన్నారు. శెనగ, కంది, గోరు చిక్కుడు వంటి పప్పు ధాన్యాలను సాగు చేస్తున్న మరో రైతు తనకు ఉన్నది రెండెకరాలే అయినప్పటికీ, తాను వేరు వేరు పంటలు వేయగలుగుతున్నానన్నారు.  తెలివిగాను, చిన్న స్థాయిలోను వ్యవసాయం చేసుకొనే తాహతును ఈ  పథకం సమకూరుస్తోందని ఆయన మాటలు తెలిపాయి.

ఒక రైతు 2010లో తాను ఒక రూం బాయ్‌గా పనిచేస్తూ, 250కి పైగా గిర్ గోవులున్న ఒక గోశాలకు యజమానిగా మారిన తీరును పంచుకున్నారు. దీనికి కారణం పశు సంవర్ధక శాఖేనని, ఆ శాఖ అందించిన 50 శాతం సబ్సిడీ తాను జీవితంలో ఎదగడానికి దోహదపడిందని ఆయన తెలిపారు.

 

ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. ఇలాంటి ప్రయోగాన్నే వారణాసిలోనూ చేశారని ఆయన గుర్తుకు తెచ్చారు. అక్కడ కొన్ని  కుటుంబాలకు గిర్ గోవులను ఇచ్చి మొదటి ఆవుదూడను తిరిగి వెనుకకు ఇవ్వాలని చెబుతారనీ, ఆ ఆవుదూడను వేరే కుటుంబాలకు అందిస్తారనీ, ఈ విధానంలో గోసంతతిని విస్తరిస్తున్నారనీ ఆయన వివరించారు.

ప్రధాన్ మంత్రీ మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) తమ జీవనంలో పెనుమార్పును తీసుకు వచ్చిందని అనేక మంది ప్రస్తావించారు. వారిలో పీహెచ్‌డీ చేసి, ఉత్తరప్రదేశ్‌లో చేపలు, రొయ్యల పెంపక రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఒక వ్యక్తి.. ఉద్యోగం కోసం ప్రయత్నించిన స్థాయి నుంచి ఉద్యోగాన్ని ఇచ్చే స్థాయికి చేరారు. ఉత్తరాఖండ్‌లో చిన్న చిన్న పల్లెల నుంచి వచ్చిన సుమారు 25 మంది యువతను ఆయన పనిలో పెట్టుకున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పీఎంఎంఎస్‌వైని గురించి తెలుసుకున్న ఓ కాశ్మీరీ యువకుడు చేపలు, రొయ్యల పెంపకాన్ని చేపట్టి, ప్రస్తుతం 14 మందికి పని చూపెట్టి, ఏడాదికి రూ.15 లక్షల లాభాన్ని సంపాదిస్తున్నారు. దేశంలో కోస్తా తీర ప్రాంతానికి చెందిన ఓ మహిళా రైతు 100 మందికి ఉపాధి కల్పించారు. ఆమె పీఎంఎంఎస్‌వైలో చేరి చలవ గిడ్డంగి, ఐస్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి చేపల పెంపకం వ్యాపారంలో ముందడుగు వేసినట్లు వివరించారు. అలంకరణకు పనికివచ్చే చేపల సాగు రంగంలో పనిచేస్తున్న మరో ఔత్సాహిక పారిశ్రామికవేత్త దేశవ్యాప్తంగా యువ వ్యవసాయ అంకుర సంస్థలకు పీఎంఎంఎస్‌వై ఒక ఆశాకిరణంగా ఉందన్నారు. చేపలు, రొయ్యల పెంపకం రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ, ఈ అవకాశాల్ని సద్వినియోగపరుచుకోవడానికి మరింత మంది యువత ముందుకు రావాలని సూచించారు.  

సఖి ఆర్గనైజేషన్ ప్రతినిధి మాట్లాడుతూ, 20 మంది మహిళలతో మొదలుపెట్టిన ఉద్యమం ఇప్పుడు పాడి రంగంలో 90,000 మంది మహిళలకు పని ని అందిస్తున్న స్థాయికి ఎలా చేరుకొందీ తెలియజేశారు. ‘‘ఉమ్మడి కృషితో 14,000 కన్నా ఎక్కువ మంది మహిళలు ‘లఖ్‌పతి దీదీలు’గా మారారు’’ అని ఆ ప్రతినిధి చెప్పారు. దీనికి ప్రధానమంత్రి స్పందిస్తూ, ‘‘ఇది నిజంగానే ఒక అద్భుతం’’ అన్నారు. ఆ స్వయంసహాయ సంఘాన్ని ఆయన ప్రశంసించారు.
 

ఝార్ఖండ్‌లోని సరాయ్‌కెలా జిల్లాలో ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సమాజంలో ఆదరణకు నోచుకోని 125 గిరిజన కుటుంబాలను దత్తత తీసుకుని, ఆ  ప్రాంతంలో సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. ‘‘ఉద్యోగాల కోసం ప్రయత్నించే  వారుగా కాక, ఉద్యోగాలను ఇచ్చే వారుగా ఎదగండి’’ అంటూ ప్రధానమంత్రి ఇచ్చిన  పిలుపు తన ఆశయసాధనలో తనకు ఎలా స్ఫూర్తినిచ్చిందీ ఆయన వివరించారు.

సంభాషణలో పాలుపంచుకున్న వారిలో అనేక మంది భావోద్వేగంతో కూడిన కృత‌జ్ఞత‌ను వెలిబుచ్చారు. వారిలో ఒక రైతు ‘‘ప్రధానమంత్రిని కలుసుకున్నామంటే అది ఏదో అద్భుత చికిత్సను పొందినట్లుగానే అనిపిస్తోంది. నేను ఒక నేతతో మాట్లాడుతున్నానని నాకనిపించడం లేదు, మా ఇంట్లోనే ఉన్న మనిషితో మాట్లాడుతున్నట్లుంది’’ అన్నారు.

కాశ్మీర్‌కు చెందిన మరో యువ ప్రతినిధి మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుత నాయకత్వంలో అభివృద్ధిపరంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ‘‘మీ ప్రభుత్వం లేకుండా, ఇందులో ఏదయినా సాధ్యపడుతుందని నేననుకోవడం లేద’’ని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికాలో మంచి లాభదాయకమైన జీవనోపాధిని 2014లో వదలిపెట్టి, భారత్‌కు తిరిగివచ్చి, గ్రామీణులను సాధికారులను చేసిన తన జీవనయాత్రను ఓ రైతు తోటివారితో పంచుకున్నారు. ఆయన రంగంలోకి దిగినప్పుడు కేవలం 10 ఎకరాలు ఉండేది. ప్రస్తుతం 300  ఎకరాల్లో వ్యవసాయం, చేపల చెరువులను నిర్వహించడమే కాకుండా 10,000కు పైగా ఎకరాలకు సరిపడే విత్తనాలను కూడా ఆయన అందిస్తున్నారు. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్ఐడీఎఫ్) అందిస్తున్న సాయంతో కేవలం 7 శాతం వడ్డీకి ఆయన ఆర్థికసాయాన్ని అందుకోగలిగారు. దీంతో ఆయన ప్రస్తుతం 200 కన్నా ఎక్కువ మందికి ఉపాధిని కల్పించే స్థాయికి తన కార్యకలాపాలను విస్తరించారు. ‘‘ఇప్పుడు ప్రధానమంత్రి శ్రీ మోదీ మా మధ్యకు రావడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది’’ అని చెబుతూ ఆ రైతు సంతోషించారు.
 

గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా ధారి నుంచి వచ్చిన ఒక ఎఫ్‌పీఓ ప్రతినిధి మాట్లాడుతూ, 1,700 మంది రైతులతో ఏర్పాటైన తమ సంస్థ 1,500 ఎకరాలు సాగు చేస్తోందన్నారు. గత నాలుగేళ్లుగా ఏటా 20 శాతం డివిడెండు అందుకుంటున్నామని ఆమె తెలిపారు. పూచీకత్తు అక్కరలేని రూ.2 కోట్ల ప్రభుత్వ రుణాన్ని తమ ఎఫ్‌పీఓ అందుకొందనీ, తమ సంస్థ కార్యకలాపాలను చెప్పుకోదగ్గ స్థాయికి పెంచడంలో ఈ రుణ సదుపాయం సాయపడిందనీ వివరించారు. ‘‘మా చేతిలో నయా పైసా లేనప్పుడు భారత ప్రభుత్వ రుణ హామీ పథకం మాకు కొండంత అండగా నిలిచింది’’ అని ఆ మహిళా రైతు సంతోషంగా అన్నారు.

రాజస్థాన్‌‌లోని జైసల్మేర్లో ఓ ఎఫ్‌పీఓ సేంద్రియ జీలకర్ర, ఇసబ్గోల్ (సైలియం ఊక)ను తయారుచేస్తోంది. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆరనైజేషన్ (ఎఫ్‌పీఓ)ను 1,000 మందికి పైగా రైతులు  కలిసి ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లు ఏకీకృత తెగులు నిర్వహణ (ఐపీఎమ్) పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ఈ సైలియం పొట్టును గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న ఎగుమతిదారుల సాయంతో ఎగుమతి చేస్తున్నారు. ఇసాబ్గోల్‌ను ఉపయోగించి ఐస్ క్రీంను తయారుచేయొచ్చేమో పరిశీలించడంటూ ప్రధానమంత్రి సూచించడంతోనే, ఈ ఆలోచన రైతులందరిలో ఆసక్తిని పెంచింది.

చిరుధాన్యాల శుద్ధి, ప్యాకేజింగు, బ్రాండింగు సహా తాను అనుసరిస్తున్న ఇతర ప్రక్రియలను వారణాసి దగ్గర్లోని మీర్జాపూర్‌ నివాసి అయిన మరో రైతు తెలియజేశారు. ఒక  అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆయన తన ఫలసాయాన్ని రక్షణ సిబ్బందితో పాటు ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందికి సరఫరా చేస్తున్నారు. ఈ ఉత్పత్తుల్లో పోషణ విలువలే కాక లాభసాటి కూడా.  

రైలు సౌకర్యం యాపిల్ రవాణాలో పెనుమార్పును తీసుకువచ్చిన వైనాన్ని కాశ్మీరుకు చెందిన ఒక యాపిల్ రైతు ప్రస్తావించారు. 60,000 టన్నుల కన్నా ఎక్కువ పండ్లను, కూరగాయలను రహదారులకు బదులు రైళ్లలో ఢిల్లీకీ, ఇతర దూర ప్రాంతాలకూ నేరుగా తక్కువ కాలంలోనే రవాణా చేయడంతో పాటు ఖర్చు కూడా తగ్గిందన్నారు.

మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఏరోపానిక్ పద్ధతిలో బంగాళదుంపలను సాగుచేస్తున్నట్లు వివరించారు. ఈ పద్ధతిలో మట్టిని వాడకుండానే నిలువెత్తు పందిళ్లలో బంగాళదుంపలను పెంచుతారు. దీనిని తాను ‘‘జైన్ పొటాటో’’ అని పిలుస్తానని ప్రధానమంత్రి చెప్పడంతో  ఆ మాటలకు అక్కడున్న వారు చిన్నగా నవ్వేశారు. జైనులు వారి ఆచారం ప్రకారం దుంపలను తినరు.

రాజస్థాన్‌లోని బారాన్ జిల్లా రైతు ఒకరు వెల్లుల్లి పొడినీ, పేస్టునూ సిద్ధం చేసే పనికి తన బృందం నడుం బిగించినట్లు వివరించారు. ప్రస్తుతం ఎగుమతికి అనుమతి పొందడానికి తాము దరఖాస్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

దేశవ్యాప్తంగా రైతులందిస్తున్న సేవల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నట్లు చెప్తూ, ప్రధానమంత్రి ఈ సమావేశాన్ని ముగించారు. 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Care economy, telemedicine key to future health jobs: PM Modi

Media Coverage

Care economy, telemedicine key to future health jobs: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasising on sacred Earth as a source of strength to the nation
March 10, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam emphasising on sacred Earth as a source of strength to the nation:

“यार्णवेऽधि सलिलमग्र आसीद्यां मायाभिरन्वचरन्मनीषिणः।

यस्या हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः।

सा नो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातूत्तमे॥”

The Subhashitam conveys that, the Earth, which is filled with water within the oceans, and surrounded by water outside, which thoughtful scholars have understood through their wisdom, and whose heart is covered by the eternal truth in the vast sky – may that earth, sustain our energy and strength in a noble nation.

The Prime Minister wrote on X;

“यार्णवेऽधि सलिलमग्र आसीद्यां मायाभिरन्वचरन्मनीषिणः।

यस्या हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः।

सा नो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातूत्तमे॥”