రాష్ట్రంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటు ప్రశంసనీయం.. ఇది రాష్ట్రంలోని పారిశ్రామిక, సృజనాత్మక, మౌలిక వనరుల రంగాల్లో విరివిగా లభించే అవకాశాలను తెలియజేసే అద్భుతమైన వేదిక: ప్రధానమంత్రి
ప్రపంచ పెట్టుబడిదారుల రాకతో ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి... మధ్యప్రదేశ్ వ్యాపార, పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చెందటం సంతోషాన్ని కలిగిస్తోందన్న ప్రధాని
ప్రపంచ భవిష్యత్తుకు భారతదేశమే ఆధారం! మా దేశంలోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోండి అంటూ ప్రధాని పిలుపు
మౌలిక రంగ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మధ్యప్రదేశ్ గణనీయంగా లబ్ధి పొందగలదన్న ప్రధానమంత్రి
అభివృద్ధికి నీరు కీలకం, నీటి భద్రతను కల్పించడం కోసం మా పాలనలోని కేంద్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్న శ్రీ మోదీ
2025లో తొలి 50 రోజులూ వేగవంతమైన అభివృద్ధిని చవిచూశాయన్న ప్రధానమంత్రి
గత దశాబ్దంలో భారత ఇంధనరంగం మునుపెన్నడూ లేని అభివృద్ధిని నమోదు చేసిందన్న శ్రీ మోదీ
ఈ సంవత్సర బడ్జెట్ ద్వారా భారత వృద్ధిలో చోదకశక్తి పాత్ర పోషిస్తున్న అన్నింటినీ బలోపేతం చేశామన్న ప్రధాని
జాతీయస్థాయి సంస్కరణల
సదస్సు నిర్వహణ కోసం అద్భుతమైన ఏర్పాట్లను చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా శ్రీ మోదీ అభినందించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యప్రదేశ్ భోపాల్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్-2025 (జీఐఎస్)ను ప్రారంభించారు. సదస్సుకు ఆలస్యంగా చేరుకున్నందుకు క్షమాపణలు తెలియచేసిన ప్రధాని, బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10వ, 12వ తరగతి విద్యార్థులు, తన రాక కోసం ఇదే మార్గంలో చేసే భద్రతాపరమైన ఏర్పాట్ల వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఆలస్యంగా బయలుదేరినట్లు చెప్పారు. భోజరాజు పాలించిన ప్రాంతంలో ఏర్పాటైన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు మదుపర్లను, వ్యాపారవేత్తలను ఆహ్వానించడం తనకు గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వికసిత్ మధ్యప్రదేశ్ కీలకం కాబట్టి నేటి కార్యక్రమం ముఖ్యమైందని ప్రధాని అన్నారు. సదస్సు నిర్వహణ కోసం అద్భుతమైన ఏర్పాట్లను చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా శ్రీ మోదీ అభినందించారు.  

“భారత్ పట్ల ప్రపంచం మొత్తం సానుకూలంగా ఉంది..” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత్ చరిత్రలో ఇటువంటి అవకాశం కలగడం ఇదే  మొదటిసారని అన్నారు. సాధారణ పౌరులు, విధానకర్తలు, సంస్థలు, ప్రపంచ దేశాలు సహా అందరికీ భారతదేశం పట్ల గొప్ప అంచనాలున్నాయని చెప్పారు. గత కొద్ది వారాలుగా భారత్ గురించి వినిపిస్తున్న సకారాత్మక వార్తలు పెట్టుబడిదార్లలో ఉత్సాహాన్ని పెంచగలవని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఇటీవల ప్రపంచ బ్యాంకు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని, “ప్రపంచ భవిష్యత్తుకు భారతదేశమే ఆధారం!” అన్న ఓఈసీడీ ప్రతినిధి మాటలని కూడా ఉటంకించారు. వాతావరణ మార్పులను పర్యవేక్షించే ఒక ఐక్యరాజ్య సమితి సంస్థ భారత్ ను సోలార్ సూపర్ పవర్ గా అభివర్ణించిందని చెప్పారు. మిగతా దేశాలు మాటలకే పరిమితమైతే, భారత్ మాత్రం చేతల్లో చూపుతోందని అదే సంస్థ చెప్పిందన్నారు. ప్రపంచ ఏరోస్పేస్ సంస్థల అవసరాలను సకాలంలో తీర్చగల అద్వితీయమైన సరఫరా వ్యవస్థలను భారత్ కలిగి ఉందని ఇటీవల వెలువడిన ఒక నివేదిక స్పష్టం చేసిందని ప్రధాని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో ఎదుర్కొనే చిక్కులకు భారత్ సరైన పరిష్కారమని ఆయా సంస్థలు భావిస్తున్నాయని చెప్పారు. భారత్ పై వివిధ దేశాలకు గల విశ్వాసాన్ని సోదాహరణంగా తెలిపిన ప్రధాని, వారి విశ్వాసం మన రాష్ట్రాలకు భరోసాన్నిస్తోందన్నారు. మధ్యప్రదేశ్ పెట్టుబడిదారుల సదస్సులో ఈ నమ్మకం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 

 

జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ దేశంలో ఐదో అతి పెద్ద రాష్ట్రమన్న ప్రధాని, “వ్యవసాయానికి, కీలక ఖనిజాలకీ ఎంపీ పెట్టింది పేరు” అన్నారు. జీవప్రదాయిని నర్మదా నదిని కలిగిన రాష్ట్రం, స్థూల జాతీయోత్పత్తి పరంగా దేశ తొలి అయిదు రాష్ట్రాల జాబితాలో స్థానం పొందగల సత్తాను కలిగి ఉందని చెప్పారు. 

గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రం పరివర్తన దిశగా ప్రయాణం చేస్తోందని, అంతకు మునుపు విద్యుత్ లోటు, నీటి కొరత, శాంతి భద్రతల సమస్యలు వంటి అనేక సవాళ్ళను రాష్ట్రం ఎదుర్కొందని గుర్తు చేశారు. ఇటువంటి సమస్యల వల్ల పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడేదని చెప్పారు. అయితే, ప్రజల అండదండలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత రెండు దశాబ్దాల్లో సుపరిపాలనపై దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. రెండు దశాబ్దాల కిందట రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి తగ్గేవారనీ, ఇప్పటి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందనీ, పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా మధ్యప్రదేశ్  పేరు తెచ్చుకుందని శ్రీ మోదీ తెలిపారు. ఒకప్పుడు గతుకుల రహదారులతో సతమతమైన ఇదే రాష్ట్రం, ఇప్పుడు విద్యుత్ వాహనాల విప్లవంలో దేశంలోని అగ్ర రాష్ట్రాల సరసన నిలుస్తోందని చెప్పారు. జనవరి 2025 నాటికి రాష్ట్రంలో 2 లక్షల విద్యుత్ వాహనాల నమోదు జరిగిందని, ఇది 90 శాతం కన్నా అధిక వృద్ధి రేటని చెప్పారు. నూతన తరహా ఉత్పాదన రంగాలకు  రాష్ట్రం అనువైనదని ఈ వృద్ధి స్పష్టం చేస్తోందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.

“గత దశాబ్దంలో మౌలిక సదుపాయాల రంగంలో భారత్ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది” అన్న ప్రధాని, మధ్యప్రదేశ్ ఈ అభివృద్ధి ఫలాలను ఇతోధికంగా పొందిందని చెప్పారు. రెండు ముఖ్య పట్టణాలను కలిపే ఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ వే అనేక చోట్ల రాష్ట్రం నుంచి ప్రయాణిస్తోందని, దాంతో ముంబయి ఓడరేవులు, ఉత్తర భారతదేశ మార్కెట్లకు అనుసంధానం వేగవంతమవుతోందని అన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ అయిదు లక్షల కిలోమీటర్లకు పైగా రహదార్లను కలిగి ఉందని ప్రధాని వెల్లడించారు. ఎంపీ పారిశ్రామికవాడలకు ఆధునిక ఎక్స్ప్రెస్ వే లతో అనుసంధానం ఎంతో మెరుగయ్యిందని, దరిమిలా రవాణా రంగంలో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

 

గగనమార్గ అనుసంధానాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో గ్వాలియర్, జబల్ పూర్ విమానాశ్రయాల్లోని టెర్మినళ్లను విస్తరించారని శ్రీ మోదీ తెలియజేశారు. మధ్యప్రదేశ్ లోని రైల్వే వ్యవస్థను ఆధునీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. ఇప్పుడు ఎంపీలోని రైల్వే వ్యవస్థ వంద శాతం విద్యుదీకరణను సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. భోపాల్ లోని రాణీ కమలాపతి రైల్వే స్టేషన్ చిత్రాలు ఇప్పటికీ అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉన్నాయని చెపుతూ, ఇదే నమూనాని అనుసరించి అమృత భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలోని 80 రైల్వే స్టేషన్ల నవీకరణ పనులు  చేపట్టనున్నారని వెల్లడించారు.  

“గత దశాబ్దంలో భారత ఇంధన రంగం మునుపెన్నడూ లేని అభివృద్ధిని నమోదు చేసింది” అంటూ హర్షాన్ని ప్రకటించిన శ్రీ మోదీ, హరిత ఇంధనరంగంలో ఒకప్పుడు ఊహకే అందని వృద్ధిని నేడు దేశం సాధించి చూపుతోందన్నారు.  గత పదేళ్ళలో పునరుత్పాదక ఇంధనరంగంలో 70 బిలియన్ డాలర్ల (5 ట్రిలియన్ కన్నా అధికమైన) మేర పెట్టుబడులు జరిగాయని, దాంతో కేవలం గత సంవత్సరంలోనే హరిత ఇంధన రంగంలో దాదాపు 10 లక్షల మేర ఉపాధి కల్పన సాధ్యపడిందన్నారు. ఇంధన రంగంలో జరిగిన వృద్ధి మధ్యప్రదేశ్ కు లాభించిందని ప్రధాని అన్నారు. 31,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో రాష్ట్రం మిగులు సాధించిందని, మొత్తం విద్యుదుత్పాదనలో 30 శాతం హరిత ఇంధన రంగానికి సంబంధించిందేనని తెలియజేశారు. దేశంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ రేవాలో ఉందని, ఇటీవల ఓంకారేశ్వర్ లో నీటిపైన తేలియాడే సోలార్ ప్లాంట్ ను ప్రారంభించారని వెల్లడించారు. మధ్యప్రదేశ్ ను పెట్రో కెమికల్స్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం బీనా రిఫైనరీ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ లో రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టిందన్నారు. ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు ఆధునిక విధానాలు, ప్రత్యేక పారిశ్రామిక సదుపాయాల ద్వారా మద్దతునిస్తోందని చెప్పారు. ఎంపీలో 300 కు పైగా పారిశ్రామిక వాడలున్నాయని, పితంపూర్, రత్లామ్, దేవాస్ లలో వేల ఎకరాల్లో పెట్టుబడి ప్రాంతాల అభివృద్ధి జరుగుతోందని, మధ్యప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే వారికి ఇబ్బడిముబ్బడిగా లాభాలు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు.  

పారిశ్రామికాభివృద్ధి కోసం నీటి భద్రత అత్యావశ్యకమన్న ప్రధానమంత్రి.. ఒకవైపు జలసంరక్షణ కోసం కృషిచేస్తూనే, మరోవైపు బృహత్తర కార్యక్రమమైన నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఈ కార్యక్రమాల వల్ల ఎంతగానో ప్రయోజనం పొందుతాయన్నారు. రూ.45,000 కోట్లతో ఇటీవల ప్రారంభించిన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు.. మధ్యప్రదేశ్ లో దాదాపు 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో ఉత్పాదకతను పెంచుతుందని, నీటి నిర్వహణను బలోపేతం చేస్తుందని శ్రీ మోదీ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయిక పరిశ్రమలు, టెక్స్ టైల్ రంగాల్లో ఈ సదుపాయాలు విశేషంగా అవకాశాలను అందిస్తాయని ఆయన చెప్పారు.

 

మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి వేగం రెట్టింపైందని వ్యాఖ్యానించిన శ్రీ మోదీ.. రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో భుజం భుజం కలిపి పనిచేస్తోందన్నారు. ఈ దఫా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత మూడు రెట్లు వేగంగా పనిచేస్తానని ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు. ‘‘ఈ వేగం 2025 మొదటి 50 రోజులలో స్పష్టంగా కనిపిస్తుంది’’ అన్నారు. ఇటీవలి బడ్జెట్ భారత వృద్ధికి ఊతమిచ్చే ప్రతి అంశాన్నీ ఉత్తేజితం చేసేదిగా ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అత్యధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులుగా ఉన్న మధ్యతరగతి ద్వారానే సేవలు, తయారీలకు డిమాండ్ ఏర్పడుతుందని ఆయన స్పష్టంచేశారు. రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా మార్చడం, పన్ను శ్లాబులను పునర్వ్యవస్థీకరించడం సహా మధ్యతరగతి సాధికారత కోసం పలు చర్యలను ఈ బడ్జెట్ లో తీసుకున్నారు. ఈ బడ్జెట్ తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిందని కూడా ఆయన పేర్కొన్నారు.

తయారీలో పూర్తి స్వావలంబన సాధించడం కోసం స్థానిక సరఫరా శ్రేణులను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టిసారించిందని చెప్తూ.. గత ప్రభుత్వాలు స్థానిక సరఫరా శ్రేణులను అవసరమైన స్థాయిలో అభివృద్ధి చేయకుండా ఎంఎస్ఎంఈల సామర్థ్యాన్ని పరిమితం చేశాయని శ్రీ మోదీ అన్నారు. ఎంఎస్ఎంఈ ఆధారిత స్థానిక సరఫరా శ్రేణులను నిర్మించడమే ప్రస్తుతం తమ ప్రాధాన్య అంశమని ఆయన స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని పెంచామని, రుణ అనుసంధాన ప్రోత్సాహకాలను అందించామని, అలాగే రుణ లభ్యతను మరింత సులభతరం చేశామని, అదనపు విలువను పొందడానికీ ఎగుమతులకూ మరింతగా చేయూతనిచ్చామని కూడా ఆయన తెలిపారు.

బడ్జెట్ లో ప్రస్తావించిన రాష్ట్రాల నియంత్రణల సడలింపు కమిషన్ గురించి వివరిస్తూ.. “గత దశాబ్ద కాలంగా జాతీయ స్థాయిలో గణనీయమైన సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. ఇప్పుడు రాష్ట్ర, స్థానిక స్థాయిల్లోనూ సంస్కరణలను ప్రోత్సహిస్తున్నాం” అని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రాలతో నిరంతరం చర్చిస్తున్నామని, రాష్ట్రాల సహకారంతో ఇటీవలి సంవత్సరాల్లో 40,000కు పైగా అనుమతులను తగ్గించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా వ్యవహారంలో లేని 1,500 చట్టాలను తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు. సులభతర వాణిజ్యానికి అవరోధాలుగా ఉన్న నియంత్రణలను గుర్తించడానికే ఈ చర్యలు తీసుకున్నామని, రాష్ట్రాల్లో పెట్టుబడి అనుకూల నియంత్రణల వ్యవస్థను నెలకొల్పడంలో ఈ సడలింపు కమిషన్ సహాయపడుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

 

ఈ బడ్జెట్ ప్రాథమిక కస్టమ్స్ సుంకాల నిర్మాణాన్ని సరళతరం చేసిందని, పరిశ్రమకు అవసరమైన అనేక ఉత్పాదకాలపై ధరలను తగ్గించిందని శ్రీ మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు. కస్టమ్స్ స్థితిగతులను అంచనా వేయడానికి కాలపరిమితిని నిర్దేశించుకున్నట్టు తెలిపారు. ఔత్సాహిక ప్రైవేటు వ్యవస్థాపకులకు, పెట్టుబడులకు కొత్త రంగాలను అందుబాటులోకి తేవడం కోసం జరుగుతున్న కృషిని ఆయన వివరించారు. ఈ ఏడాది అణు ఇంధనం, బయో మాన్యుఫాక్చరింగ్, కీలక ఖనిజాల ప్రాసెసింగ్, లిథియం బ్యాటరీ తయారీ వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశం కల్పించామని, ప్రభుత్వ సంకల్పానికీ నిబద్ధతకూ ఈ చర్యలు నిదర్శనమని అన్నారు.

“భవిష్యత్తులో భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపడంలో వస్త్ర పరిశ్రమ, పర్యాటకం, సాంకేతికత రంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పత్తి, పట్టు, పాలిస్టర్, విస్కోజ్ ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. వస్త్రపారిశ్రామిక రంగం కోట్లాది మందికి ఉద్యోగాలను కల్పిస్తోందన్నారు. ఆ రంగంలో సుసంపన్నమైన సంప్రదాయం, నైపుణ్యాలు, ఔత్సాహిక పారిశ్రామికత భారత్ సొంతమన్నారు. భారత పత్తి రాజధానిగా మధ్యప్రదేశ్ పేరెన్నిక గన్నదని, దేశ సేంద్రియ పత్తి సరఫరాలో దాదాపు 25 శాతం వాటా ఆ రాష్ట్రానికి ఉందని చెప్పారు. మల్బరీ పట్టులోనూ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మధ్యప్రదేశ్ ఉందనీ, ఈ రాష్ట్రానికి చెందిన చందేరి, మహేశ్వరి చీరలు అమితంగా ప్రసిద్ధి చెంది భౌగోళిక గుర్తింపు ట్యాగ్ ను పొందాయని తెలిపారు. మధ్యప్రదేశ్ వస్త్రపరిశ్రమకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవడంలో ఈ రంగంలో పెట్టుబడులు విశేషంగా ప్రభావం చూపుతాయని ఆయన స్పష్టం చేశారు.

సాంప్రదాయిక టెక్స్ టైల్ రంగంతోపాటు సరికొత్త మార్గాలను భారత్ అన్వేషిస్తోందని చెప్తూ.. ఆగ్రో టెక్స్ టైల్స్, మెడికల్ టెక్స్ టైల్స్, జియో టెక్స్ టైల్స్ వంటి టెక్నికల్ టెక్స్ టైల్స్ ను ప్రోత్సహిస్తున్నామని ప్రధానమంత్రి వివరించారు. ఇందుకోసం ఒక జాతీయస్థాయి మిషన్ ను ప్రారంభించామని, దాన్ని ప్రోత్సహించడానికి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పీఎం-మిత్ర పథకం బాగా ప్రసిద్ధి చెందిందని, మధ్యప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా ఏడు పెద్ద టెక్స్‌టైల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని శ్రీ మోదీ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా టెక్స్ టైల్ రంగంలో వృద్ధి మరింత ఉన్నత స్థితికి చేరుతుందన్నారు. ఈ రంగం కోసం ప్రకటించిన పీఎల్ఐ పథకాన్ని పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు.

 

టెక్స్ టైల్ రంగంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్న విధంగానే పర్యాటక రంగాన్ని కూడా భారత్ అభివృద్ధి చేస్తోందని శ్రీ మోదీ అన్నారు. ‘మధ్యప్రదేశ్ అజబ్ హై, సబ్ సే గజబ్ హై’ అన్న రాష్ట్ర పర్యాటక నినాదాన్ని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్ లో నర్మదా నది చుట్టుపక్కల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యాటక మౌలిక సదుపాయాలు విశేషంగా అభివృద్ధి చెందడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉన్న అనేక జాతీయ పార్కుల గురించి, ఆరోగ్య, వైద్య పర్యాటకంలో ఉన్న అపారమైన అవకాశాల గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ‘భారత్ లో స్వస్థత’ మంత్రప్రదంగా మారి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందుతోందని, ఆరోగ్య, వైద్య రంగాల్లో పెట్టుబడి అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. భారతదేశ సంప్రదాయిక చికిత్సలు, ఆయుష్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ప్రత్యేక ఆయుష్ వీసాలను జారీ చేస్తున్నామని శ్రీ మోదీ వివరించారు. ఈ కార్యక్రమాలు మధ్యప్రదేశ్ కు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. పర్యాటకులు ఉజ్జయినిలోని మహాకాల్ మహాలోక్ ను సందర్శించి, అక్కడ మహాకాలుడి ఆశీస్సులు పొందాలని కోరిన ఆయన.. తద్వారా దేశ పర్యాటక, ఆతిథ్య రంగం ఎంతలా విస్తరిస్తోందో తెలుస్తుందన్నారు.

ఎర్రకోట నుంచి చేసిన తన ప్రకటనను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి.. మధ్య ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి, పెట్టుబడులను పెంచడానికి ఇదే సరైన తరుణమని చెప్తూ ప్రసంగాన్ని ముగించారు.

మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ ఛగన్ భాయ్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

భోపాల్ లో రెండు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్)-2025 మధ్యప్రదేశ్ ను అంతర్జాతీయ పెట్టుబడుల నిలయంగా తీర్చిదిద్దే ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. జీఐఎస్ లో విభాగాల వారీగా సదస్సులతోపాటు ఫార్మా - వైద్య పరికరాలు, రవాణా - లాజిస్టిక్స్, పారిశ్రామికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం- ఎంఎస్ఎంఈ, తదితర అంశాలపై ప్రత్యేక సదస్సులను నిర్వహిస్తారు. అంతర్జాతీయ అభివృద్ధి చెందుతున్న దేశాలు, లాటిన్ అమెరికా, కరీబియన్, ముఖ్య భాగస్వామ్య దేశాలతో వేర్వేరుగా ప్రత్యేక సదస్సుల వంటి అంతర్జాతీయ కార్యక్రమాలు కూడా ఇందులో ఉంటాయి.

సమ్మిట్ సందర్భంగా మూడు ప్రధాన పారిశ్రామిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆటో ప్రదర్శన మధ్యప్రదేశ్ ఆటోమోటివ్ సమర్థతను, భవిష్యత్తులో ఆ రంగంలో రాష్ట్ర ఉత్పాదక సామర్థ్యాన్ని చాటుతుంది. సాంప్రదాయిక, ఆధునిక వస్త్రాల తయారీలో రాష్ట్ర నైపుణ్యాన్ని చాటేలా టెక్స్ టైల్ అండ్ ఫ్యాషన్ ఎక్స్ పో సాగుతోంది. ‘ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) రాష్ట్రంలోని గ్రామీణ విశిష్ట కళానైపుణ్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా ఉంది.

60కి పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు, వివిధ అంతర్జాతీయ సంస్థల అధికారులు, భారత్ కు చెందిన 300 మందికి పైగా పారిశ్రామిక ప్రముఖులు, విధాన నిర్ణేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to a mishap in Nashik, Maharashtra
December 07, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Nashik, Maharashtra.

Shri Modi also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Deeply saddened by the loss of lives due to a mishap in Nashik, Maharashtra. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi”