ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐసిటి ఆధారితమైన మల్టి- మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ప్రగతి) మాధ్యమం ద్వారా ఈ రోజు జరిగిన 26వ ముఖాముఖి సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఇంతవరకు నిర్వహించబడినటువంటి 25 ‘ప్రగతి’ సమావేశాలలోనూ మొత్తంమీద 10 లక్షల కోట్లకు పైగా వ్యయంతో కూడిన 227 ప్రోజెక్టులను సమీక్షించడమైంది. పలు రంగాలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తీరు ను కూడా సమీక్షించడం జరిగింది.
ఈ రోజున జరిగిన 26వ సమావేశంలో తపాలా కార్యాలయాలు, ఇంకా రైల్వేలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకారం మరియు పరిష్కారం దిశగా నమోదైన పురోగతి ని ప్రధాన మంత్రి సమీక్షించారు. తపాలా మరియు రైలు నెట్వర్క్ లలో డిజిటల్ లావాదేవీలను పెంచవలసిన ప్రాముఖ్యాన్ని, ప్రత్యేకించి భీమ్ యాప్ వినియోగాన్ని గురించి ఆయన నొక్కి చెప్పారు.
రైల్వేలు, రహదారులు, పెట్రోలియమ్, ఇంకా విద్యుత్తు రంగాలలో 9 అవస్థాపన పథకాలలో చోటు చేసుకొన్న పురోగతి ని ప్రధాన మంత్రి సమీక్షించారు. ఈ ప్రోజెక్టులు హరియాణా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బిహార్, ఝార్ ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళ నాడు మరియు ఆంధ్ర ప్రదేశ్ లతో సహా పలు రాష్ట్రాలలో విస్తరించివున్నాయి. ఈ ప్రోజెక్టులలో వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడోర్ మరియు చార్ ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన లు కూడా కలసివున్నాయి.
అమృత్ మిశన్ అమలు లోని పురోగతి ని ప్రధాన మంత్రి సమీక్షించారు. లక్షిత పిడిఎస్ కార్యకలాపాల తాలూకు ఎండ్-టు-ఎండ్ కంప్యూటరైజేశన్ కార్యక్రమాన్ని కూడా ఆయన సమీక్షించారు.