మన ఆటగాళ్లందరికీ మన శుభాకాంక్షలు తెలియజేయండి మరియు వారిని ప్రోత్సహిద్దాం: ప్రధాని మోదీ
కార్గిల్ యుద్ధం భారత బలగాల ధైర్యానికి మరియు నిగ్రహానికి ప్రతీక, ఇది ప్రపంచం మొత్తం చూసింది: ప్రధాని మోదీ
'అమృత్ మహోత్సవ్ 'ప్రభుత్వం లేదా ఏ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. ఇది భారత ప్రజల కార్యక్రమం: ప్రధాని మోదీ
#MyHandloomMyPride: ఖాదీ మరియు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ పౌరులను కోరారు
'మన్ కి బాత్ 'సానుకూలత మరియు సున్నితత్వాన్ని కలిగి ఉంది. దీనికి సామూహిక పాత్ర ఉంది: ప్రధాని మోదీ
మన్ కీ బాత్ కోసం దాదాపు 75% సలహాలు 35 ఏళ్లలోపువారని తెలుసుకోవడం ఆనందంగా ఉంది: ప్రధాని మోదీ
ప్రతి చుక్క నీటిని ఆదా చేయడం, ఎలాంటి నీరు వృథా కాకుండా నిరోధించడం మన జీవితంలో ఒక భాగంగా మారాలి: ప్రధాని మోదీ

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం..

రెండు రోజుల కిందటి కొన్ని అద్భుతమైన చిత్రాలు, కొన్ని ఎప్పటికీ గుర్తుండే క్షణాలు ఇప్పటికీ నా కళ్ల ముందు ఉన్నాయి. కాబట్టి ఈసారి ఆ క్షణాలతో 'మన్ కి బాత్' ప్రారంభిద్దాం. టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాల్లచేతిలో త్రివర్ణ పతాకం రెపెరెపెలాడటం చూసి  చూసి నేను మాత్రమే కాదు- దేశం యావత్తూ రోమాంచితమైంది. దేశం మొత్తం ఐక్యంగా ఈ యోధులతో విజయీభవ.. విజయీభవ అని చెప్పినట్టుగా అనిపించింది.

ఈ క్రీడాకారులు భారతదేశం నుండి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడే అవకాశం లభించింది. వారి గురించి తెలుసుకుని, దేశానికి చెప్పే అవకాశం నాకు దొరికింది. ఈ ఆటగాళ్ళు జీవితంలోని అనేక సవాళ్లను అధిగమించి ఇక్కడికి చేరుకున్నారు. ఈ రోజు వారికి మీ ప్రేమ, సహకారాల శక్తి లభించింది. కాబట్టి అందరం కలిసి మన ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. సోషల్ మీడియాలో ఒలింపిక్ ఆటగాళ్లకు మద్దతు తెలిపే మన విక్టరీ పంచ్ ప్రచారం ఇప్పుడు ప్రారంభమైంది. మీరు కూడా విక్టరీ పంచ్‌ను మీ బృందంతో కలిసి పంచుకోండి. భారతదేశానికి ఉత్సాహాన్ని అందించండి.

మిత్రులారా! దేశం కోసం త్రివర్ణ పతాకాన్ని పట్టుకునే వారి గౌరవార్థం భావోద్వేగాలతో ఉండడం సహజం. ఈ దేశభక్తి భావన మనందరినీ ఏకం చేస్తుంది.

రేపు- అంటే జూలై 26వ తేదీన 'కార్గిల్ విజయ్ దివస్' కూడా ఉంది. కార్గిల్ యుద్ధం భారతదేశ ధైర్యానికి, సంయమనానికి ప్రతీక. దీన్ని ప్రపంచం మొత్తం చూసింది. ఈసారి ఈ అద్భుతమైన రోజును 'అమృత్ మహోత్సవ్' మధ్యలో జరుపుకుంటున్నాం. కాబట్టి ఇది మరింత ప్రత్యేకమైంది. కార్గిల్ రోమాంచితం చేసె కార్గిల్ గాథను మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. కార్గిల్ హీరోలకు మనమందరం వందనం సమర్పిద్దాం.

మిత్రులారా! ఈసారి ఆగస్టు 15 న దేశం స్వాతంత్య్రం వచ్చి 75 వ సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది. శతాబ్దాలుగా దేశం ఎదురుచూసిన స్వాతంత్ర్యానికి 75 సంవత్సరాలు వచ్చిన ఈ సమయంలో ఈ ఉత్సవాలకు మనం సాక్షులుగా ఉండడం మన గొప్ప అదృష్టం. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను 'అమృత్ మహోత్సవ్' పేరుతో మార్చి 12 న బాపుకు చెందిన సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభించిన విషయం మీకు గుర్తుండే వుంటుంది . అదే రోజున బాపు దండి యాత్రను కూడా పునరుద్ధరించడం జరిగింది. అప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ మొదలుకొని పుదుచ్చేరి వరకు, గుజరాత్ మొదలుకొని ఈశాన్య భారతదేశం వరకు 'అమృత్ మహోత్సవ్' కు సంబంధించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇలాంటి అనేక సంఘటనల గురించి, ఎంతో గొప్ప త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల గురించి గతంలో పెద్దగా చర్చ జరగలేదు. ఈ రోజు ప్రజలు వారి గురించి కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఉదాహరణకు మొయిరాంగ్ డే నే తీసుకోండి! మణిపూర్ లోని మొయిరాంగ్ అనే చిన్న పట్టణం ఒకప్పుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఎ) కి ప్రధాన స్థావరం. అక్కడ స్వాతంత్ర్యానికి ముందే ఐఎన్ఎకు చెందిన కల్నల్ షౌకత్ మాలిక్ జెండాను ఎగురవేశారు. 'అమృత్ మహోత్సవ్' సందర్భంగా ఏప్రిల్ 14 వ తేదీన అదే మొయిరాంగ్‌లో త్రివర్ణ పతాకాన్ని మరోసారి ఎగురవేశారు. చాలా మంది గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు, మహోన్నత వ్యక్తులు ఉన్నారు. వీరిని దేశం 'అమృత్ మహోత్సవ్'లో గుర్తుంచుకుంటుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలను ప్రభుత్వం, సామాజిక సంస్థలు నిరంతరం నిర్వహిస్తున్నాయి. అలాంటి ఒక కార్యక్రమం ఈసారి ఆగస్టు 15 వ తేదీన జరగబోతోంది. ఇది ఒక ప్రయత్నం. జాతీయ గీతంతో అనుసంధానించిన ప్రయత్నం. ఆ రోజున భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఒకేసారి కలిసి జాతీయగీతం పాడేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. దీని కోసం ఒక వెబ్‌సైట్ కూడా రూపొందించారు. ఆ వెబ్ సైట్ రాష్ట్ర్ గాన్ డాట్ ఇన్. ఈ వెబ్‌సైట్ సహాయంతో మీరు జాతీయ గీతాన్ని పాడి రికార్డ్ చేయగలుగుతారు, ఈ ఉద్యమంలో చేరగలుగుతారు. ఈ ప్రత్యేకమైన కృషిలో మీరు ఖచ్చితంగా చేరతారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ప్రచారాలు, మరెన్నో ప్రయత్నాలను రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. 'అమృత్ మహోత్సవ్' ఏ ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఏ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. ఇది కోట్లాది భారత ప్రజల కార్యక్రమం. స్వేచ్ఛాయుతమైన, కృతజ్ఞతాభావం కలిగిన ప్రతి భారతీయుడు స్వాతంత్ర్య సమరయోధులకు వందనం సమర్పిస్తాడు. ఈ పండుగ ప్రాథమిక భావన చాలా విస్తృతమైంది. ఈ భావన మన స్వాతంత్య్ర సమరయోధుల బాటను అనుసరించడానికి, వారి కలల దేశాన్ని నిర్మించడానికి మార్గం. దేశ స్వాతంత్య్ర సమరయోధులు స్వేచ్ఛ కోసం ఏకమయ్యారు. అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం మనం ఏకం కావాలి.

మనం దేశం కోసం జీవించాలి. దేశం కోసం పని చేయాలి. ఇందులో చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను తెస్తాయి. రోజువారీ పని చేస్తూ కూడా మనం దేశ నిర్మాణం చేయగలం. ఉదాహరణకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం. మన దేశంలోని స్థానిక పారిశ్రామికవేత్తలు, కళాకారులు, హస్తకళాకారులు, చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడం మన సహజ స్వభావంలో భాగంగా ఉండాలి. ఆగస్టు 7 న వస్తున్న జాతీయ చేనేత దినోత్సవం ఈ పనిని మనం ప్రయత్నించేందుకు ఒక సందర్భం. జాతీయ చేనేత దినోత్సవానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం చాలా ఉంది. 1905 లో ఇదేరోజు స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది.

మిత్రులారా! మన దేశంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చేనేత పెద్ద ఆదాయ వనరు. లక్షలాది మంది మహిళలు, లక్షలాది మంది నేత కార్మికులు, లక్షలాది మంది హస్తకళాకారులతో సంబంధం ఉన్న రంగమిది. మీ చిన్న ప్రయత్నాలు నేత కార్మికులకు కొత్త ఆశను ఇస్తాయి. మీరు ఏదో ఒకటి కొనండి. మీ అభిప్రాయాన్ని ఇతరులతో పంచుకోండి. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకుంటున్నప్పుడు అలా చేయటం మన బాధ్యత సోదరులారా! మీరు తప్పక గమనించి ఉంటారు- 2014 సంవత్సరం నుండి మనం తరచుగా 'మన్ కి బాత్' లో ఖాదీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీ కృషి వల్ల ఈ రోజు ఖాదీ అమ్మకం దేశంలో అనేక రెట్లు పెరిగింది. ఒక ఖాదీ దుకాణం రోజుకు 1 కోట్ల రూపాయలకు పైగా అమ్మగలదని ఎవరైనా ఊహించగలరా! కానీ మీరు దీన్ని కూడా సాధ్యం చేశారు. మీరు ఖాదీ బట్టలు కొన్నప్పుడు మన పేద చేనేత సోదరులకు ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి, ఖాదీ కొనడం ఒక విధంగా ప్రజా సేవ. ఇది దేశానికి చేసే సేవ కూడా. గ్రామీణ ప్రాంతాల్లో తయారైన చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి, వాటిని #MyHandloomMyPride అనే హాష్ ట్యాగ్ తో పంచుకోవాలని నా ప్రియ సోదరులైన మీ అందరినీ కోరుతున్నాను.

మిత్రులారా! స్వాతంత్య్ర ఉద్యమం, ఖాదీ విషయానికి వస్తే పూజ్య బాపును గుర్తుంచుకోవడం సహజం. బాపు నాయకత్వంలో ‘భారత్ చోడో’ అనే 'క్విట్ ఇండియా ఉద్యమం' ప్రారంభించినట్టే ఈ రోజు ప్రతి దేశస్థుడు ‘భారత్ జోడో’ అనే భారత్ తో సంధాన ఉద్యమానికి నాయకత్వం వహించాలి. భారతదేశాన్ని వైవిధ్యంతో అనుసంధానించడంలో సహాయపడే విధంగా కృషి చేయడం మన కర్తవ్యం. కాబట్టి 'అమృత్ మహోత్సవ్' సందర్భంగా ఈ అమృత సంకల్పంతో ముందుకు సాగుదాం. దేశమే మన అతిపెద్ద విశ్వాసమని, మన అతిపెద్ద ప్రాధాన్యత అని తీర్మానం చేసుకుందాం. "నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్" అనే మంత్రంతో మనం ముందుకు సాగాలి.

నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు, 'మన్ కీ బాత్' వింటున్న నా యువ సహచరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల క్రితం 'మన్ కి బాత్' శ్రోతలకు సంబంధించి మైగవ్ వేదిక పక్షాన ఒక అధ్యయనం చేశారు. 'మన్ కీ బాత్' కోసం సందేశాలు , సలహాలను పంపే ప్రధాన వ్యక్తులు ఎవరు అనే విషయం ఈ అధ్యయనంలో తెలిసింది. సందేశాలు, సలహాలను పంపే వారిలో 75 శాతం మంది 35 ఏళ్లలోపువారని తేలింది. అంటే భారత యువ శక్తి సూచనలు 'మన్ కీ బాత్'కు దిశానిర్దేశం చేస్తున్నాయని ఈ అధ్యయనం దృష్టికి వచ్చింది. నేను దీన్ని చాలా మంచి సంకేతంగా చూస్తున్నాను. 'మన్ కి బాత్' సానుకూలత, సున్నితత్వం ఉన్న మాధ్యమం. 'మన్ కి బాత్' లో మనం పాజిటివ్ అంశాలను మాట్లాడుతాం. ఈ కార్యక్రమానికి సమిష్టి స్వభావం ఉంటుంది. ఈ విధంగా సానుకూల ఆలోచనలు, సలహాల విషయంలో భారతీయ యువత క్రియాశీలత నాకు సంతోషాన్ని ఇస్తుంది. 'మన్ కి బాత్' ద్వారా యువత మనసును కూడా తెలుసుకునే అవకాశం లభించడం నాకు సంతోషంగా ఉంది.

మిత్రులారా! మీ నుండి వచ్చే సూచనలే 'మన్ కి బాత్'కి నిజమైన శక్తి. మీ సూచనలు 'మన్ కీ బాత్' ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని వెల్లడిస్తాయి. భారతదేశ ప్రజల సేవ, త్యాగాల పరిమళాన్ని నాలుగు దిక్కుల్లో వ్యాప్తి చేస్తాయి. మన శ్రామిక యువత ఆవిష్కరణలు ప్రతి ఒక్కరికీ ప్రేరణనిస్తాయి. 'మన్ కి బాత్' కోసం మీరు అనేక రకాల ఆలోచనలను పంపుతారు. మేం వాటన్నింటినీ చర్చించలేం. కానీ నేను వాటిలో చాలా ఆలోచనలను సంబంధిత విభాగాలకు పంపుతాను. తద్వారా వాటిపై మరింత కృషి చేయవచ్చు.

మిత్రులారా! సాయి ప్రణీత్ గారి ప్రయత్నాల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సాయి ప్రణీత్ గారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వాతావరణ దుష్ప్రభావం కారణంగా రైతులు చాలా నష్టపోవలసి వచ్చిన విషయాన్ని గత సంవత్సరం ఆయన చూశారు. వాతావరణ శాస్త్రంలో చాలా సంవత్సరాలుగా ఆయన ఆసక్తి కలిగి ఉన్నారు. తన ఆసక్తిని, తన ప్రతిభను రైతుల శ్రేయస్సు కోసం ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన వేర్వేరు వనరుల నుండి వాతావరణ సమాచారాన్ని కొనుగోలు చేస్తారు. వాటిని విశ్లేషించి, అవసరమైన సమాచారాన్ని స్థానిక భాషలో వివిధ మాధ్యమాల ద్వారా రైతులకు పంపుతారు. వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు అందజేయడంతో పాటు ప్రణీత్ గారు వివిధ వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు ఏం చేయాలో మార్గదర్శనం చేస్తారు. ముఖ్యంగా వరదలను నివారించడానికి ఏం చేయాలో చెప్పడంతో పాటు తుఫాను, పిడుగుపాటులాంటి సందర్భాలలో ఎలా రక్షణ పొందాలనే విషయాల గురించి ప్రజలకు చెబుతారు.

మిత్రులారా! ఒకవైపు ఇలాంటి మరో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రయత్నం హృదయ స్పందన కలిగిస్తుంది. మరోవైపు మన మిత్రుల్లో ఒకరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ మిత్రుడు ఒడిషాలోని సంబల్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తున్న ఇసాక్ ముండా గారు. గతంలో రోజువారీ కూలీ కార్మికుడిగా పనిచేసే ఇసాక్ గారు ఇప్పుడు ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయారు. ఆయన తన యూట్యూబ్ ఛానల్ నుండి చాలా డబ్బు సంపాదిస్తున్నారు. స్థానిక వంటకాలు, సాంప్రదాయిక వంట పద్ధతులు, వారి గ్రామం, వారి జీవనశైలి, కుటుంబం, ఆహార అలవాట్లను వారి వీడియోలలో ప్రముఖంగా చూపిస్తారు. యూట్యూబర్‌గా ఆయన ప్రయాణం 2020 మార్చిలో ప్రారంభమైంది. ఒడిషాకు చెందిన ప్రసిద్ధ స్థానిక వంటకాలైన పఖాల్ కు సంబంధించిన వీడియోను అప్పుడు పోస్ట్ చేశారు. అప్పటి నుండి ఆయన వందలాది వీడియోలను పోస్ట్ చేశాడు. ఆయన కృషి అనేక కారణాల వల్ల భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఇది నగరాల్లో నివసించే ప్రజలకు పెద్దగా తెలియని జీవనశైలిని చూసే అవకాశాన్ని ఇస్తుంది. ఇసాక్ ముండా గారు సంస్కృతిని, వంటకాలను అనుసంధానిస్తున్నారు. మనందరికీ స్ఫూర్తినిస్తున్నారు.

మిత్రులారా! మనం సాంకేతిక పరిజ్ఞానం గురించి చర్చిస్తున్నప్పుడు నేను మరొక ఆసక్తికరమైన అంశాన్ని చర్చించాలనుకుంటున్నాను. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థులు స్థాపించిన స్టార్ట్-అప్ సంస్థ 3 డి ప్రింటెడ్ హౌస్‌ను సృష్టించిందని మీరు ఇటీవల చదివి ఉండాలి. 3 డి ప్రింటింగ్ ద్వారా ఇల్లు కట్టుకోవడం ఎలా జరిగింది? వాస్తవానికి ఈ స్టార్ట్-అప్ సంస్థ మొదట ఒక 3D ప్రింటర్‌కు మూడు కొలతలుండే డిజైన్ ను అందించింది. తరువాత ఒక ప్రత్యేకమైన కాంక్రీటు ద్వారా పొరలు పొరలుగా 3 డి నిర్మాణాన్ని రూపొందించింది. ఇలాంటి అనేక ప్రయోగాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుంది. గతంలో చిన్న నిర్మాణ పనులకు కూడా సంవత్సరాలు పట్టేది. కానీ ఈరోజుల్లో భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పరిస్థితి మారుతోంది. ప్రపంచం నలుమూలల నుండి ఇటువంటి వినూత్న సంస్థలను ఆహ్వానించడానికి కొంతకాలం క్రితం గ్లోబల్ హౌజింగ్ టెక్నాలజీ ఛాలెంజ్‌ను ప్రారంభించాం. ఇది దేశంలో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. కాబట్టి వాటికి లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ అని పేరు పెట్టాం. ప్రస్తుతం దేశంలోని 6 వేర్వేరు ప్రదేశాలలో లైట్ హౌస్ ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ లైట్ హౌస్ ప్రాజెక్టుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వినూత్న పద్ధతులను ఉపయోగిస్తారు. ఇది నిర్మాణాల సమయాన్ని తగ్గిస్తుంది. నిర్మించిన ఇళ్ళు మరింత మన్నికైనవిగా, చవకగా, సౌకర్యవంతంగా ఉంటాయి. నేను ఇటీవల ఈ ప్రాజెక్టులను డ్రోన్ల ద్వారా సమీక్షించాను. పని పురోగతిని ప్రత్యక్షంగా చూశాను.

ఇండోర్ ప్రాజెక్టులో ఇటుక, మోర్టార్ గోడలకు బదులుగా ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ శాండ్‌విచ్ ప్యానెల్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. రాజ్‌కోట్‌లో లైట్ హౌస్‌లను ఫ్రెంచ్ సాంకేతికతతో నిర్మిస్తున్నారు. ఇందులో సొరంగం ద్వారా మోనోలిథిక్ కాంక్రీట్ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన గృహాలు విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి. చెన్నైలో అమెరికా, ఫిన్లాండ్ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. ప్రీ-కాస్ట్ కాంక్రీట్ వ్యవస్థను వాడుతున్నారు. దీంతో ఇళ్ళ నిర్మాణం వేగంగా పూర్తవుతుంది. ఖర్చు కూడా తగ్గుతుంది. జర్మనీ 3 డి నిర్మాణ వ్యవస్థను ఉపయోగించి రాంచీలో ఇళ్ళని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రతి గదిని విడిగా తయారు చేస్తారు. బ్లాక్ బొమ్మలను జోడించబడిన విధంగా మొత్తం నిర్మాణాన్ని అనుసంధానిస్తారు. అగర్తలలో న్యూజిలాండ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉక్కు చట్రంతో ఇళ్ళు నిర్మిస్తున్నారు. ఇవి పెద్ద భూకంపాలను కూడా తట్టుకోగలవు. లక్నోలో కెనడియన్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ప్లాస్టర్, పెయింట్ అవసరం ఉండదు. ఇంటిని వేగంగా నిర్మించడానికి ఇప్పటికే తయారుచేసిన గోడలను ఉపయోగిస్తారు.

మిత్రులారా! ఈ ప్రాజెక్టులను ఇంక్యుబేషన్ సెంటర్ల మాదిరిగా పని చేయించడానికి నేడు దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మన ప్లానర్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు, విద్యార్థులు కొత్త టెక్నాలజీని తెలుసుకోగలుగుతారు. దానితో కూడా ప్రయోగాలు చేయగలరు. మన యువతను దేశ ప్రయోజనాల కోసం సాంకేతిక పరిజ్ఞానపు కొత్త రంగాల వైపు ప్రోత్సహించేందుకు నేను ఈ విషయాలను ముఖ్యంగా మన యువత కోసం పంచుకుంటున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! మీరు ‘టు లర్న్ ఈజ్ టు గ్రో’ అనే ఆంగ్ల సామెతను విని ఉంటారు. ‘నేర్చుకోవడం అంటే ఎదగడమే’ అని దాని అర్థం. మనం కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు పురోగతికి కొత్త మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. మూస ధోరణులకు భిన్నంగా కొత్తగా ఏదైనా చేసే ప్రయత్నం జరిగినప్పుడల్లా మానవత్వం కోసం కొత్త తలుపులు తెరుచుకున్నాయి. కొత్త శకం ప్రారంభమయింది. ఎక్కడో కొత్త ప్రయత్నం జరిగినప్పుడు దాని ఫలితం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యాపిల్ తో అనుసంధానం అయ్యే రాష్ట్రాలు ఏవి అని నేను మిమ్మల్ని అడిగితే మీ మనస్సులో మొదట హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ , ఉత్తరాఖండ్ పేర్లు గుర్తొస్తాయని స్పష్టంగా తెలుస్తుంది. ఈ జాబితాలో మణిపూర్‌ను కూడా చేర్చాలని నేను చెబితే బహుశా మీకు ఆశ్చర్యం వేస్తుంది. కొత్తగా ఏదైనా చేయాలనే అభిరుచి ఉన్న యువత మణిపూర్‌లో ఈ ఘనత సాధించారు. ఈ రోజుల్లో మణిపూర్ లోని ఉక్రుల్ జిల్లాలో యాపిల్ సాగు జోరందుకుంది. ఇక్కడి రైతులు తమ తోటలలో ఆపిల్ పండిస్తున్నారు. యాపిల్ సాగు కోసం ఈ ప్రజలు హిమాచల్ వెళ్ళి శిక్షణ కూడా తీసుకున్నారు. వారిలో ఒకరు టి.ఎస్.రింగ్‌ ఫామి యొంగ్ గారు. ఆయన వృత్తిరీత్యా ఏరోనాటికల్ ఇంజనీర్. ఆయన తన భార్య శ్రీమతి టి.ఎస్. ఏంజెల్ గారితో కలిసి యాపిల్ సాగు చేశారు. అదేవిధంగా అవుంగ్షీ షిమ్రే అగస్టినా గారు కూడా తన తోటలలో యాపిల్ ను సాగు చేశారు. అవుంగ్షీ గారు ఢిల్లీలో ఉద్యోగం చేసేవారు. దాన్ని వదిలి ఆమె తన గ్రామానికి తిరిగి వచ్చి యాపిల్ సాగు ప్రారంభించారు. ఈ రోజు మణిపూర్‌లో ఇలా యాపిల్ పండించేవారు చాలా మంది ఉన్నారు. వారు భిన్నమైన దాన్ని, కొత్త విషయాన్ని చేసి చూపించారు.

మిత్రులారా! మన ఆదివాసీ సమాజంలో బెర్రీ చాలా ప్రాచుర్యం పొందింది. గిరిజన వర్గాల ప్రజలు దీన్ని ఎప్పుడూ సాగు చేస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి తరువాత దాని సాగు పెరుగుతోంది. త్రిపురలోని ఉనకోటికి చెందిన 32 సంవత్సరాల నా యువ స్నేహితుడు బిక్రమ్ జీత్ చక్మా గారు బెర్రీ సాగు ప్రారంభించడం ద్వారా చాలా లాభాలను ఆర్జించారు. ఇప్పుడు ఆయన బెర్రీ సాగు చేయడానికి ప్రజలను కూడా ప్రేరేపిస్తున్నారు. అలాంటి వారికి సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. దీని కోసం ప్రభుత్వం అనేక ప్రత్యేక నర్సరీలను తయారు చేసింది. తద్వారా ఈ పంటతో సంబంధం ఉన్న ప్రజల డిమాండ్ తీరుతుంది. వ్యవసాయంలో పరివర్తన జరుగుతోంది. కాబట్టి వ్యవసాయ ఉప ఉత్పత్తులలో కూడా సృజనాత్మకత కనిపిస్తోంది.

మిత్రులారా! ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరిలో చేసిన ప్రయత్నం గురించి కూడా నాకు తెలిసింది. కోవిడ్ కాలం లోనే లఖింపూర్ ఖీరిలో ఒక ప్రత్యేకమైన కృషి జరిగింది. అక్కడ పనికిరాని అరటి కాండం నుండి ఫైబర్ తయారు చేయడానికి మహిళలకు శిక్షణ ఇచ్చే పని ప్రారంభమైంది. వ్యర్థాల నుండి ఉత్తమమైనవి చేయడానికి ఇది ఒక మార్గం. అరటి కాండాన్ని ఒక యంత్రం సహాయంతో కత్తిరించడం ద్వారా అరటి ఫైబర్ ను తయారు చేస్తారు. ఇది జనపనార వంటిది. చేతి సంచులు, చాపలు, కార్పెట్లు మొదలైన ఎన్నో వస్తువులను ఈ ఫైబర్ నుండి తయారు చేస్తారు. ఈ కారణంగా పంట వ్యర్థాల వాడకం ప్రారంభమైంది. మరోవైపు గ్రామంలో నివసిస్తున్న మన సోదరీమణులకు, బాలికలకు మరో ఆదాయ వనరు వచ్చింది. అరటి ఫైబర్ పని తో ఒక స్థానిక మహిళ రోజుకు నాలుగు వందల నుండి ఆరు వందల రూపాయలు సంపాదిస్తుంది. లఖింపూర్ ఖీరిలో వందల ఎకరాల భూమిలో అరటి సాగు చేస్తారు. అరటి పంట కోసిన తరువాత రైతులు సాధారణంగా కాండం విసిరేందుకు అదనపు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు వారి డబ్బు కూడా ఆదా అయింది. ‘ఆమ్ కే ఆమ్.. గుఠ్ లియోం కే దామ్’ అన్ హిందీ సామెత ఇక్కడ ఖచ్చితంగా సరిపోతుంది.

మిత్రులారా! ఒక వైపు అరటి ఫైబర్ నుంచి ఉత్పత్తులు తయారవుతుండగా మరోవైపు అరటి పిండి నుంచి దోస, గులాబ్ జామున్ వంటి రుచికరమైన వంటకాలను కూడా తయారు చేస్తున్నారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లోని మహిళలు ఈ ప్రత్యేకమైన పనిని చేస్తున్నారు. కరోనా కాలంలోనే ఇది ప్రారంభమైంది. ఈ మహిళలు అరటి పిండి నుండి దోస, గులాబ్ జామున్ వంటి వాటిని తయారు చేయడమే కాకుండా ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అరటి పిండి గురించి ఎక్కువ మందికి తెలియగానే దాని డిమాండ్ కూడా పెరిగింది. ఈ మహిళల ఆదాయం కూడా పెరిగింది. లఖింపూర్ ఖీరి మాదిరిగానే అక్కడ కూడా మహిళలే ఈ వినూత్న ఆలోచనకు నాయకత్వం వహిస్తున్నారు.

మిత్రులారా! ఇలాంటి ఉదాహరణలు జీవితంలో కొత్తగా ఏదైనా చేయటానికి ప్రేరణగా మారతాయి. మీ చుట్టూ కూడా ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. మీ కుటుంబంలో మీ మనసులోని విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మే ముచ్చటలలో మీరు వాటిని కూడా భాగం చేసుకోవాలి. కొంత సమయం కేటాయించి, పిల్లలతో ఇటువంటి ప్రయత్నాలను చూడటానికి వెళ్ళండి. మీకు అవకాశం వస్తే మీరే ఇలా ఏదైనా చేసి చూపించండి. అవును.. మీరు నమోయాప్ లేదా మైగవ్‌లో ఇవన్నీ నాతో పంచుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది.

నా ప్రియమైన దేశవాసులారా! మన సంస్కృత గ్రంథాలలో ఒక శ్లోకం ఉంది -

ఆత్మార్థం జీవ లోకే అస్మిన్, కో న జీవతి మానవః

పరమ పరోపకారార్థం, యో జీవతి స జీవతి.

 

అంటే “ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనకోసం జీవిస్తారు. కానీ ఏ వ్యక్తి పరోపకారం కోసం జీవిస్తాడో ఆ వ్యక్తీ ఎప్పటికి జీవిస్తాడు .” భారత మాత కుమారులు, కుమార్తెల దాతృత్వ కృషిని గురించిన మాటలే 'మన్ కీ బాత్'. ఈ రోజు కూడా మనం అలాంటి మరికొందరు సహచరుల గురించి మాట్లాడుతాం. ఇలాంటి ఒక మిత్రుడు చండీగఢ్ నగరానికి చెందినవారు. చండీగఢ్ లో నేను కూడా కొన్ని సంవత్సరాలు నివసించాను. ఇది చాలా ఆనందాల అందమైన నగరం. ఇక్కడ నివసించే ప్రజలు కూడా దయామయులు. అవున.. మీరు భోజన ప్రియులు అయితే మీరు మరింత ఎక్కువగా ఆనందిస్తారు. చండీగఢ్ సెక్టార్ 29 లో సంజయ్ రాణా గారు ఒక ఫుడ్ స్టాల్ నడుపుతారు. తన సైకిల్ పై చోలే-భతురేను అమ్ముతారు. ఒక రోజు అతని కుమార్తె రిద్దిమా, మేనకోడలు రియా ఒక ఆలోచనతో ఆయన దగ్గరికి వచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ పొందిన వారికి చోలే-భతురే ను ఉచితంగా ఇవ్వమని వారిద్దరూ ఆయనను కోరారు. ఆయన సంతోషంగా దానికి అంగీకరించారు. వెంటనే ఈ మంచి, గొప్ప ప్రయత్నాన్ని ప్రారంభించారు. సంజయ్ రాణా గారి దగ్గర చోలే-భతురేను ఉచితంగా తినడానికి అదే రోజున మీకు వ్యాక్సిన్ తీసుకున్నట్టు చూపించాల్సి ఉంటుంది. టీకా సందేశాన్ని చూపించిన వెంటనే వారు మీకు రుచికరమైన చోలే-భతురేను ఇస్తారు. సమాజ శ్రేయస్సు కోసం డబ్బు కంటే అధికంగా సేవాభావం, కర్తవ్య నిర్వహణా భావం అవసరమని చెబుతారు. మన సంజయ్ భాయ్ ఈ మాట నిజమని నిరూపిస్తున్నారు.

మిత్రులారా! అలాంటి మరొక పని గురించి ఈ రోజు చర్చించాలనుకుంటున్నాను. ఈ పని తమిళనాడులోని నీలగిరిలో జరుగుతోంది. అక్కడ రాధికా శాస్త్రి గారు అంబురెక్స్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం కొండ ప్రాంతాలలో రోగుల చికిత్స కోసం సులభంగా రవాణా సౌకర్యాలు అందించడం. రాధిక గారు కూనూర్‌లో కేఫ్ నడుపుతున్నారు. ఆమె తన కేఫ్ సహచరుల నుండి అంబురెక్స్ కోసం నిధులు సేకరించారు. ఈ రోజు 6 అంబురెక్స్ వాహనాలు  నీలగిరి కొండలపై సేవలు అందిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో అత్యవసర సమయంలో రోగుల వద్దకు వస్తున్నాయి. స్ట్రెచర్, ఆక్సిజన్ సిలిండర్, ప్రథమ చికిత్స పెట్టె వంటి అత్యవసర సామగ్రి ని అంబురెక్స్ లో ఏర్పాటు చేశారు.

మిత్రులారా! సంజయ్ గారైనా, రాధిక గారైనా మన పని, మన వ్యాపారం, మన ఉద్యోగం చేసుకుంటూనే సేవ చేయవచ్చని నిరూపిస్తున్నారు.

మిత్రులారా! కొద్ది రోజుల క్రితం చాలా ఆసక్తికరమైన, చాలా భావోద్వేగాన్ని కలిగించే సంఘటన జరిగింది. ఇది భారతదేశం-జార్జియా స్నేహానికి కొత్త బలాన్ని ఇచ్చింది. ఈ వేడుకలో సెయింట్ క్వీన్ కేటేవాన్ పవిత్ర స్మృతి చిహ్నాన్ని జార్జియా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు భారతదేశం అందజేసింది. దీని కోసం మన విదేశాంగ మంత్రి స్వయంగా అక్కడికి వెళ్లారు. చాలా భావోద్వేగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జార్జియా అధ్యక్షుడు, ప్రధానమంత్రి, అనేక మంది మత పెద్దలు , పెద్ద సంఖ్యలో జార్జియన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారతదేశాన్ని ప్రశంసిస్తూ చెప్పిన మాటలు గుర్తుండిపోయేవి. ఈ ఒక్క వేడుక ఇరు దేశాలతో పాటు గోవా- జార్జియా మధ్య సంబంధాలను మరింత బలపరిచింది. సెయింట్ క్వీన్ కేటేవాన్ పవిత్ర అవశేషాలు 2005 లో గోవాలోని సెయింట్ అగస్టిన్ చర్చి దగ్గర లభ్యమయ్యాయి.

మిత్రులారా! ఇవన్నీ ఏమిటి? ఎప్పుడు? ఎలా జరిగింది అనే ప్రశ్న మీ మనస్సులో ఉంటుంది. వాస్తవానికి ఇది నాలుగైదు వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయం. కేటేవాన్ రాణి జార్జియా రాజకుటుంబ కుమార్తె. పదేళ్ల జైలు శిక్ష తర్వాత 1624 లో ఆమె అమరులయ్యారు. పురాతన పోర్చుగీస్ పత్రం ప్రకారం, సెయింట్ క్వీన్ కేటేవాన్ అస్థికల భస్మాన్ని  పాత గోవాలోని సెయింట్ అగస్టిన్ కాన్వెంట్లో ఉంచారు. కానీ ఖననం చేసిన ఆమె అవశేషాలు 1930 లో గోవాలో వచ్చిన భూకంపం కారణంగా కనుమరుగయ్యాయని చాలా కాలంగా భావించారు.

భారత ప్రభుత్వం, జార్జియన్ చరిత్రకారులు, పరిశోధకులు, పురావస్తు శాస్త్రవేత్తలు, జార్జియన్ చర్చి దశాబ్దాల పాటు జరిపిన అవిశ్రాంత ప్రయత్నాల తరువాత ఆమె అవశేషాలు 2005 లో లభించాయి. ఈ విషయం జార్జియా ప్రజలకు చాలా భావోద్వేగంగా మారింది. అందుకే వారి చారిత్రక, మత, ఆధ్యాత్మిక మనోభావాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఈ అవశేషాలలో కొంత భాగాన్ని జార్జియా ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. భారతదేశం- జార్జియా భాగస్వామ్య చరిత్రలో ఈ ప్రత్యేకమైన భాగాన్ని కాపాడినందుకు గోవా ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గోవా గొప్ప ఆధ్యాత్మిక వారసత్వ ప్రదేశంగా ఉంది. సెయింట్ అగస్టిన్ చర్చి, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, గోవా చర్చిలు , కాన్వెంట్లు- ఇవన్నీ నెలవైన ప్రదేశం గోవా.

నా ప్రియమైన దేశవాసులారా! జార్జియా నుండి ఇప్పుడు మిమ్మల్ని నేరుగా సింగపూర్‌కు తీసుకెళ్తాను. అక్కడ ఈ నెల ప్రారంభంలో మరో అద్భుతమైన సంఘటన జరిగింది. ఇటీవల పునరుద్ధరించిన సిలాట్ రోడ్ గురుద్వారాను సింగపూర్ ప్రధాని, నా స్నేహితుడు లీ సెన్ లూంగ్ ప్రారంభించారు. సాంప్రదాయిక సిక్కు తలపాగా కూడా ధరించారు. ఈ గురుద్వారాను సుమారు వంద సంవత్సరాల క్రితం నిర్మించారు. భాయ్ మహారాజ్ సింగ్ కు అంకితం చేసీన స్మారక చిహ్నం కూడా అక్కడ ఉంది. భాయ్ మహారాజ్ సింగ్ గారు భారత స్వాతంత్ర్యం కోసం పోరాడారు. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ క్షణం మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధం ఇలాంటి ప్రయత్నాల వల్లే పెరుగుతుంది. సామరస్యపూర్వక వాతావరణంలో జీవించడం, ఒకరి సంస్కృతిని మరొకరు అర్థం చేసుకోవడంలో ఎంత గొప్పదనం ఉంటుందో కూడా వారు నిరూపిస్తారు.

నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు 'మన్ కీ బాత్'లో మనం చాలా విషయాలు చర్చించాం. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న మరొక విషయం ఉంది. ఇదే నీటి సంరక్షణ అంశం. నా బాల్యం గడిచిన చోట నీటి కొరత ఎప్పుడూ ఉండేది. మేం వర్షం కోసం ఆరాటపడే వాళ్ళం. అందువల్ల ప్రతి చుక్క నీటిని ఆదా చేయడం మా ఆచారాలలో ఒక భాగం. ఇప్పుడు ‘ప్రజల భాగస్వామ్యం తో నీటి సంరక్షణ’ అనే మంత్రం అక్కడి చిత్రాన్ని మార్చింది. ప్రతి చుక్క నీటిని ఆదా చేయడం, నీరు వృధా కాకుండా నిరోధించడం మన జీవనశైలిలో సహజమైన భాగంగా మారాలి. అలాంటి సంప్రదాయం మన కుటుంబాలలో ఉండాలి. ఇది ప్రతి ఒక్కరినీ గర్వించేలా చేస్తుంది.

మిత్రులారా! ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ భారతదేశ సాంస్కృతిక జీవితంలో, మన దైనందిన జీవితంలో భాగం. వర్షం, రుతుపవనాలు ఎల్లప్పుడూ మన ఆలోచనలను, మన తత్వాన్ని, మన నాగరికతను తీర్చిదిద్దుతాయి. ఋతు సంహారం, మేఘదూతం కావ్యాలలో మహా కవి కాళిదాసు వర్షం గురించి చాలా అందమైన వర్ణన చేశారు. ఈ కావ్యాలు సాహిత్య ప్రియులలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఋగ్వేదంలోని పర్జన్య సూక్తంలో కూడా వర్షాన్ని అందంగా వర్ణించారు. అదేవిధంగా భూమి, సూర్యుడు, వర్షం మధ్య ఉన్న సంబంధాన్ని శ్రీమద్ భాగవతంలో కవితాత్మకంగా వివరించారు.

అష్టౌ మాసాన్ నిపీతం యద్, భూమ్యా చ, ఓద్-మయం వసు|

స్వగోభిః మోక్తుమ్ ఆరేభే, పర్జన్యః కాల్ ఆగతే ||

అంటే సూర్యుడు భూమి సంపదను ఎనిమిది నెలలుగా నీటి రూపంలో దోపిడీ చేశాడు. ఇప్పుడు వర్షాకాలంలో సూర్యుడు ఈ పేరుకుపోయిన సంపదను భూమికి తిరిగి ఇస్తున్నాడు. నిజమే.. రుతుపవనాలు, వర్షాకాలం అందమైనవి, ఆహ్లాదకరమైనవి మాత్రమే కాదు- అవి పోషకాయలను అందించేవి.. జీవితాన్ని ఇస్తాయి. మనకు లభిస్తున్న వర్షపు నీరు మన భవిష్యత్ తరాల కోసం. దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.

ఈ ఆసక్తికరమైన సూచనలతోనే నా ప్రసంగాన్ని ఎందుకు ముగించకూడదని ఈ రోజు ఒక ఆలోచన వచ్చింది. మీ అందరికీ రాబోయే పర్వదినాల శుభాకాంక్షలు. పండుగలు, పర్వదినాల సమయంలో కరోనా ఇంకా మన మధ్య నుండి వెళ్లలేదని గుర్తుంచుకోవాలి. కరోనాకు సంబంధించిన నియమాలను మీరు మరచిపోవలసిన అవసరం లేదు. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి.

చాలా చాలా ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s space programme, a people’s space journey

Media Coverage

India’s space programme, a people’s space journey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Congratulates Shri S. Suresh Kumar Ji on Inspiring Cycling Feat
January 01, 2026

āThe Prime Minister, Shri Narendra Modi, today lauded the remarkable achievement of Shri S. Suresh Kumar Ji, who successfully cycled from Bengaluru to Kanniyakumari.

Shri Modi noted that this feat is not only commendable and inspiring but also a testament to Shri Suresh Kumar Ji’s grit and unyielding spirit, especially as it was accomplished after overcoming significant health setbacks.

PM emphasized that such endeavors carry an important message of fitness and determination for society at large.

The Prime Minister personally spoke to Shri Suresh Kumar Ji and congratulated him for his effort, appreciating the courage and perseverance that made this journey possible.

In separate posts on X, Shri Modi wrote:

“Shri S. Suresh Kumar Ji’s feat of cycling from Bengaluru to Kanniyakumari is commendable and inspiring. The fact that it was done after he overcame health setbacks highlights his grit and unyielding spirit. It also gives an important message of fitness.

Spoke to him and congratulated him for effort.

@nimmasuresh

https://timesofindia.indiatimes.com/city/bengaluru/age-illness-no-bar-at-70-bengaluru-legislator-pedals-702km-to-kanyakumari-in-five-days/articleshow/126258645.cms#

“ಬೆಂಗಳೂರಿನಿಂದ ಕನ್ಯಾಕುಮಾರಿಯವರೆಗೆ ಸೈಕಲ್ ಸವಾರಿ ಕೈಗೊಂಡ ಶ್ರೀ ಎಸ್. ಸುರೇಶ್ ಕುಮಾರ್ ಅವರ ಸಾಧನೆ ಶ್ಲಾಘನೀಯ ಮತ್ತು ಸ್ಫೂರ್ತಿದಾಯಕವಾಗಿದೆ. ಆರೋಗ್ಯದ ಹಿನ್ನಡೆಗಳನ್ನು ಮೆಟ್ಟಿ ನಿಂತು ಅವರು ಈ ಸಾಧನೆ ಮಾಡಿರುವುದು ಅವರ ದೃಢ ನಿರ್ಧಾರ ಮತ್ತು ಅಚಲ ಮನೋಭಾವವನ್ನು ಎತ್ತಿ ತೋರಿಸುತ್ತದೆ. ಇದು ಫಿಟ್ನೆಸ್ ಕುರಿತು ಪ್ರಮುಖ ಸಂದೇಶವನ್ನೂ ನೀಡುತ್ತದೆ.

ಅವರೊಂದಿಗೆ ಮಾತನಾಡಿ, ಅವರ ಈ ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸಿದೆ.

@nimmasuresh

https://timesofindia.indiatimes.com/city/bengaluru/age-illness-no-bar-at-70-bengaluru-legislator-pedals-702km-to-kanyakumari-in-five-days/articleshow/126258645.cms#