భారత్‌-కెనడా సంయుక్త ప్రకటన

Published By : Admin | March 2, 2026 | 17:05 IST

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు కెనడా ప్రధానమంత్రి మాననీయ మార్క్‌ కార్నీ ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల 2వ తేదీ వరకూ భారతదేశంలో పర్యటించారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక కార్నీ తొలిసారి భారత్‌లో పర్యటించగా, 2018 తర్వాత కెనడా ప్రధానమంత్రి ఒకరు ద్వైపాక్షిక పర్యటన కోసం మన దేశానికి రావడం ఇదే మొదటిసారి. కెనడా ప్రభుత్వంలోని సీనియర్‌ మంత్రులు, రాష్ట్రాల అధినేతలు, అగ్రగామి పరిశ్రమల ‘సీఈవో’లతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఆయన వెంట వచ్చింది.
ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 79వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ, కెనడా-భారత్‌ స్నేహబంధం ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రులిద్దరూ పునరుద్ఘాటించారు. ఈ స్నేహం ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య ప్రగాఢ అనుబంధం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై గౌరవం, చట్టబద్ధ పాలన, సమష్టి నిబద్ధతపై ఆధారపడి ఉంటుందని వారు పేర్కొన్నారు.
ప్రపంచ పరిస్థితులు సంక్లిష్టం, అనిశ్చితంగా మారుతున్న నేపథ్యంలో రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన, పునరుత్థాన, భవిష్యద్దార్శనిక భాగస్వామ్యం ఆవశ్యకత ఎంతయినా ఉందని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు పరస్పర సౌభాగ్యం, ఉమ్మడి ప్రపంచ ప్రాథమ్యాలను అమలు చేయడంలో ఈ సంబంధం అర్థవంతంగా దోహదం చేస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ నియమనిబంధనల సముచిత అనుసరణ, ఆర్థిక పునరుత్థాన బలోపేతం, సుస్థిర ప్రగతికి ప్రోత్సాహం, వాతావరణ మార్పు, సత్వర సాంకేతిక పరివర్తన, ప్రజారోగ్యం సహా ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో భారత్‌-కెనడా సన్నిహిత సహకారం తోడ్పడుతుందని వారు వివరించారు. ప్రజాస్వామ్య విలువల కొనసాగింపు, సమ్మిళిత వృద్ధికి మద్దతుతోపాటు ఇండో-పసిఫిక్ సహా ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సౌభాగ్యానికి దోహదం చేసేలా ద్వైపాక్షిక, బహుపాక్షిక వేదికలపై ఉమ్మడిగా కృషి చేయాలనే సంకల్పాన్ని నాయకులు ప్రకటించారు.
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో ఈ ఉమ్మడి దృక్కోణం ప్రాతిపదికగా “వసుధైవ కుటుంబకం” లేదా “ఒకే భూగోళం-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు” సూత్రాన్ని సమగ్ర మార్గదర్శక చట్రంగా స్వీకరించాలని వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. సమష్టి ప్రపంచ బాధ్యత, స్థిరత్వం, సమ్మిళితత్వంపై వారి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తోంది. మరోవైపు ‘వికసిత భారత్’ ‘బిల్డ్ కెనడా స్ట్రాంగ్’ కార్యక్రమాల మధ్య సమన్వయాన్ని వారు స్పష్టం చేశారు. వృద్ధి, ఆవిష్కరణ, ఇంధన పరివర్తన, ఆహారం-పోషకాహార భద్రత, విశ్వసనీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థలు, పునరుత్ధాన సరఫరా వ్యవస్థలు, నైపుణ్యాలు, ప్రతిభ ఆదానప్రదానం, ప్రజా కేంద్రక ప్రగతిలో మెరుగైన ద్వైపాక్షిక సహకారం, పునరుత్థాన సమాజాలు, భాగస్వామ్య శ్రేయస్సు సహా రెండు దేశాలతోపాటు విస్తృత ప్రపంచానికి మరింత స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఈ భాగస్వామ్య సహకార విస్తృతి ఉత్ప్రేరకం కాగలదని వారు పేర్కొన్నారు.
కొత్త భవిష్యత్‌ ప్రణాళిక అమలు-పురోగమనం
కననాస్కిస్‌లో జి7 శిఖరాగ్ర సమావేశం, జోహన్నెస్‌బర్గ్‌లో జి20 శిఖరాగ్ర సదస్సుల సందర్భంగా తమ సమావేశాల నేపథ్యంలో కెనడా-భారత్ సంబంధాలపై కొత్త భవిష్యత్‌ ప్రణాళిక అమలు, గణనీయ పురోగమనంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. కెనడా-భారత్ భాగస్వామ్య బలోపేతానికి ఈ ప్రణాళిక ద్వారా వారు విస్పష్ట దిశానిర్దేశం చేశారు. ప్రాధాన్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి నవ్యోత్తేజమిచ్చిన ద్విముఖ మంత్రిత్వ స్థాయి చర్చల దిశగా సమావేశాల సంఖ్యను పెంచడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. వివిధ సంస్థాగత చర్చల విధాన క్రియాశీలతను, మెరుగైన ఉప-జాతీయ చర్చలను కూడా స్వాగతించారు. పరస్పర అవగాహన, విధాన సమన్వయాన్ని మరింత పెంచడంలో వీటి ప్రాముఖ్యాన్ని అంగీకరించారు. దౌత్య ప్రతినిధులు వారి సంబంధిత కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించడంపై అంగీకారానికి వచ్చారు. పరస్పర గౌరవం, ఏకాభిప్రాయం, సహకారాల స్ఫూర్తితో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలను క్రమంగా సాధారణీకరించడంపై తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యలను ప్రశంసించారు.
ఇటీవలి కాలంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా)పై చర్చలకు శ్రీకారంతోపాటు కీలక వాణిజ్య ప్రకటనలు, పెట్టుబడి హామీల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన వాణిజ్య పునాది పడటాన్ని నాయకులు ప్రముఖంగా ప్రస్తావించారు. ద్వైపాక్షిక ఆర్థిక బంధం విస్తృతి, వైవిధ్యీకరణ, ఆధునికతను ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, రెండు మార్కెట్లలో వ్యాపారాలు, పెట్టుబడిదారులలో పెరుగుతున్న విశ్వాసాన్ని కూడా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాధాన్య రంగాల్లో కొత్త అవకాశాల అన్వేషణ, వాణిజ్య వేగాన్ని దీర్ఘకాలిక-పరస్పర ప్రయోజనకర ఆర్థిక వృద్ధిగా మలచడం, సానుకూల విధాన వాతావరణంతో పరిశ్రమ-ప్రభుత్వం మధ్య నిరంతర సంబంధాలు అత్యావశ్యకమని నాయకులిద్దరూ అంగీకరించారు.
ఇదే వేగం ప్రాతిపదికగా కింది ప్రాధాన్య రంగాల్లో సహకార విస్తృతిపై వారు ఏకాభిప్రాయానికి వచ్చారు:
ఒకే భూగోళం
వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం
ఇంధన శక్తులుగా తమ పరస్పర బలాలను రెండు దేశాలూ గుర్తించాయి. తదనుగుణంగా ఇంధన విలువ వ్యవస్థ అంతటా దీర్ఘకాలిక సహకారాన్ని మరింత పెంచే శగా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్య పరిధిని విస్తృతం చేసేందుకు నాయకులు అంగీకరించారు. రెండు దేశాల భద్రత, శ్రేయస్సు, ఆర్థిక సామర్థ్యం ఇంధన భద్రత, సరఫరాలో వైవిధ్యీకరణకు ఎనలేని ప్రాధాన్యం ఉందని వారు పునరుద్ఘాటించారు. అలాగే స్థోమత, స్థిరత్వం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో భాగంగా కాలుష్య రహిత, సంప్రదాయ ఇంధనాలు, పౌర అణుశక్తి సహా కీలక ఖనిజ రంగంలోనూ సహకార విస్తృతిపై ఉమ్మడి నిబద్ధతను స్పష్టం చేశారు.
ఉన్నత స్థాయి విధాన చర్చల కొనసాగింపు, ఇంధన భద్రత, సరఫరా వైవిధ్యీకరణ, దీర్ఘకాలిక మార్కెట్ ఏకీకరణలపై వ్యూహాత్మక సహకార బలోపేతానికి కీలక సంస్థాగత వేదిక వంటి ‘ఇండియా ఎనర్జీ వీక్-2026లో రెండు దేశాల మధ్య మంత్రిత్వ స్థాయి చర్చల పునఃప్రారంభాన్ని నాయకులు స్వాగతించారు. అలాగే, దీనికింద ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై హర్షం వ్యక్తం చేశారు.
పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్-దాని ఉత్పన్నాలు, జీవ ఇంధనాలు, సుస్థిర విమాన ఇంధనం, బ్యాటరీ నిల్వ, విద్యుత్ వ్యవస్థల ఆధునికీకరణ సహా కాలుష్య రహిత ఇంధనం, వాతావరణ సంబంధిత విలువ వ్యవస్థలలో సహకార విస్తృతి సామర్థ్యాన్ని నాయకులు ప్రముఖంగా ప్రస్తావించారు. ఉమ్మడి వాతావరణ లక్ష్యాలు, ఇంధన మార్పిడి లక్ష్యాల సాధనలో ఈ రంగాలు కీలక పాత్ర పోషించగలవని వారు పేర్కొన్నారు.
ఇంధనం, కీలక ఖనిజాల సుస్థిర ఉత్పత్తికి గణనీయ అవకాశాలుగల సహకార రంగంలో కర్బన సంగ్రహణ, వినియోగం, నిల్వ (సీసీయూఎస్‌) దిశగా పరిష్కారాన్వేషణ ప్రాధాన్యాన్ని నాయకులు స్పష్టం చేశారు.
వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యంతో రెండు దేశాలకూ విస్పష్ట, దీర్ఘకాలిక ప్రయోజనాలిచ్చే దిశగా ద్వైపాక్షిక, బహుపాక్షిక విధానాల ద్వారా నిపుణుల నిరంతర సహకారం, సంయుక్త కృషి సహా ప్రభుత్వాల మధ్య, వ్యాపారాల మధ్య స్థిరమైన చర్చలను ప్రోత్సహించడంపై వారు ఆసక్తి వెలిబుచ్చారు.
ఇంధన వాణిజ్యం
ద్రవీకృత సహజ వాయువు (ఎన్‌ఎన్‌జీ), ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎప్‌పీజీ), ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, పొటాష్, యురేనియం సరఫరా ఒప్పందాలు సహా ద్వైపాక్షిక ఇంధన వాణిజ్య విస్తరణకు బలమైన సంస్థాగత సంబంధాలు మద్దతిస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఈ దిశగా కెనడా ‘కామెకో’, భారత అణుశక్తి శాఖ మధ్య దీర్ఘకాలిక యురేనియం సరఫరా కోసం 2.6 బిలియన్‌ కెనడా డాలర్ల విలువైన వాణిజ్య ఒప్పందం కుదిరడాన్ని వారు స్వాగతించారు. భారత పౌర అణుశక్తి ఉత్పత్తి, కాలుష్య రహిత ఇంధన పరివర్తన లక్ష్యాలు, దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదం చేస్తుంది.
‘ఎల్‌ఎన్‌జీ’ రంగంలో ప్రపంచ సరఫరాదారుగా ఎదగేందుకు కెనడా సిద్ధంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కెనడా నుంచి ‘ఎల్‌ఎన్‌జీ’ రవాణాకు భారత్‌ సంసిద్ధతను స్వాగతించారు. గడచిన ఐదేళ్లుగా కీలక భారీ చమురు సరఫరాదారుగా కెనడా ఆవిర్భవించడంపై వారు హర్షం వెలిబుచ్చారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు, నాలుగో అతిపెద్ద ‘ఎన్‌ఎన్‌జీ'’ దిగుమతిదారుగా ఉన్న భారత్‌ ఈ స్థాయిని అధిగమిస్తోంది. తదనుగుణంగా రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ పెరుగుదలలో భారత్‌ అతిపెద్ద వాటాదారు కానుంది. దీనికి అనుగుణంగా ద్వైపాక్షిక ఇంధన వాణిజ్యాన్ని మరింత విస్తరించగల గణనీయ సామర్థ్యాన్ని ఉభయ పక్షాలూ గుర్తించాయి. ఇందులో కెనడా నుంచి భారత్‌కు చమురు, ‘ఎల్‌ఎన్‌జీ’ దిగుమతులు, అలాగే భారత్‌ నుంచి కెనడాకు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా అంతర్భాగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2030కల్లా ఏటా 50 మిలియన్ టన్నుల ‘ఎల్‌ఎన్‌జీ’ ఉత్పత్తిపై కెనడా లక్ష్యనిర్దేశం చేసుకుంది. తద్వారా ఇండో-పసిఫిక్ మార్కెట్‌కు భారీ చమురు ఎగుమతి మౌలిక సదుపాయాలతోపాటు ‘ఎల్‌ఎన్‌జీ’ సరఫరాను విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు కెనడా ప్రకటించింది. అంతేకాకుండా 2040 నాటికి 100 మిలియన్ టన్నులదాక ఉత్పత్తి చేయాలనే లక్ష్యం కూడా ఉందని పేర్కొంది.
‘ఎల్‌పీజీ’ రంగంలో ద్వైపాక్షిక సహకార విస్తరణకు భారత ప్రభుత్వ రంగ చమురు-గ్యాస్ కంపెనీలు, కెనడా ఇంధన సంస్థల మధ్య చర్చలపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ‘ఎల్‌పీజీ’ సరఫరాపై కెనడాతో భారత్‌ తొలి దీర్ఘకాలిక ఒప్పందం ఖరారు దిశగా చర్చలను వారు స్వాగతించారు. ఇటువంటి భాగస్వామ్యాలు ఇంధన వాణిజ్యాన్ని మరింత వైవిధ్యీకరిస్తాయని, సరఫరా భద్రతను బలోపేతం చేయడంతోపాటు హైడ్రోకార్బన్ విలువ వ్యవస్థలో సహకారానికి కొత్త బాటలు పరుస్తాయని వారు విశ్వాసం ప్రకటించారు.
వాణిజ్యపరంగా లాభదాయకమైన ఇంధన భాగస్వామ్యాలకు మద్దతు దిశగా రుణమంజూరు, ఆర్థిక సహాయం, ఈక్విటీ పెట్టుబడులు వంటి సాధనాలతో ప్రైవేట్ పెట్టుబడిని ఆకర్షించడంతోపాటు దీర్ఘకాలిక ఆఫ్‌టేక్ ఏర్పాట్లకు మద్దతును కూడా ఉభయ పక్షాలు పునరుద్ఘాటించాయి. భారత్‌-కెనడా ఇంధన చర్చల ద్వారా దీర్ఘకాలిక ఒప్పందాలకుగల అవకాశాల అన్వేసణతోపాటు షిప్పింగ్ వ్యయం తగ్గింపు, కెనడా హెవీ ఆయిల్ సరఫరా లభ్యత పెంపు వంటి వాణిజ్య విస్తరణ సవాళ్ల పరిష్కారానికీ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఉభయ పక్షాలూ రూపొందిస్తాయి.

కీలక ఖనిజాల విషయంలో సహకారం

రెండు దేశాల మార్కెట్లలో ఉన్న భారీ ప్రాజెక్టులు, వర్ధమాన అవకాశాలను గుర్తించిన ఇరు దేశాల నాయకులు.. ఇంధన, సహజ వనరుల రంగాలలో దీర్ఘకాలిక, పరస్పర పెట్టుబడి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. దృఢత్వం కలిగిన సురక్షిత, వైవిధ్యభరితమైన కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యంతో 'కీలక ఖనిజాల సహకారం'పై అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని వారు స్వాగతించారు. ఈ క్రమంలో 'జీ7 కీలక ఖనిజాల కార్యచరణ ప్రణాళిక'ను భారత్ ఆమోదించడాన్ని వారు అభినందించారు. ఇది ఖనిజాల బాధ్యతాయుత ఉత్పత్తి, సరఫరాతో పాటు స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ, సాంకేతిక రంగాలకు అవసరమైన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. 2026 మార్చిలో కెనడాలో జరిగే 'ప్రాస్పెక్టర్స్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ కెనడా' (పీడీఏసీ) సమావేశంలో భారత్ భాగస్వామ్యం.. 2026 వేసవిలో భారత ఇంధన, పారిశ్రామిక మంత్రుల బృందం కెనడా పర్యటన గురించి నాయకులు చర్చించారు. ఈ పర్యటనలు భారత్, కెనడా కంపెనీల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలకు బాటలు వేస్తాయన్న ఆకాంక్షతో ఉన్నట్లు వారు తెలిపారు.

స్వచ్ఛ ఇంధన సాంకేతికలు, భవిష్యత్తు ఆధారిత పరిశ్రమలకు మద్దతుగా పెట్టుబడి రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని నాయకులు నిర్ణయించారు. భారత్ చేపట్టిన 'ఖనిజాల నిల్వ కార్యక్రమానికి' ఉపయోగపడే విధంగా సహకార మార్గాలను అన్వేషించడం, ఇరు దేశాల కంపెనీలు మంచి వాణిజ్య ప్రదర్శన కనబరిచేలా ప్రోత్సహించడంపై దృష్టి సారించటంతో పాటు కీలక ఖనిజాలు, ఇంధన పరివర్తన మార్గాలపై సహకారాన్ని మరింత దృఢంగా కొనసాగించాలని వారు అంగీకరించారు. అదే సమయంలో ఉద్గారాల తగ్గింపు, ఇంధన మార్పిడి సాంకేతికతలపై పరస్పర నైపుణ్యాలను పంచుకోవాలని కూడా వారు నిశ్చయించారు.

స్వచ్ఛ ఇంధన సహకారం

సౌర- పవన- జీన ఇంధనం, చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టులు, ఇంధన నిల్వ, నైపుణ్యాభివృద్ధి రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి ఒక సమగ్ర సంస్థాగత చట్రాన్ని ఏర్పాటు చేసే 'స్వచ్ఛ ఇంధన సహకారం'పై అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఇరు దేశాల నాయకులు స్వాగతించారు. ఇంధన భద్రతను బలోపేతం చేయటం, ఉమ్మడి పెట్టుబడి అవకాశాల ద్వారా ఇంధన పరివర్తనను వేగవంతం చేయటం, ఒక ప్రత్యేక 'జాయింట్ వర్కింగ్ గ్రూప్'తో పాటు ఇతర మార్గాల ద్వారా పునరుత్పాదక ఇంధన విలువ గొలుసులో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించే పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు వారు అంగీకరించారు. ఈ సహకారం స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ దృఢత్వం, అందరికీ అందుబాటులో ఉండే స్వచ్ఛ ఇంధన భవిష్యత్తును నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యానికి తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు.

2050 నాటికి తన విద్యుత్ సరఫరాను రెట్టింపు చేయటం.. పునరుత్పాదక ఇంధనం, ఇంధన నిల్వను గణనీయంగా విస్తరించాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో భారీ స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టులు, గ్రిడ్ స్థాయి ఇంధన నిల్వ సాంకేతికతలు, పైకప్పు సౌర విద్యుత్, వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన పరిష్కారాలలో భారత్ నాయకత్వం, సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునే అధికారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు 2026లో 'భారత్-కెనడా పునరుత్పాదక ఇంధన, నిల్వ సదస్సు' నిర్వహించాలని ఇరు దేశాల నాయకులు నిర్ణయించారు. భవిష్యత్తులో కొనుగోళ్లు, సరఫరా గొలుసు భాగస్వామ్యాల ద్వారా ఈ సాంకేతికతలను కెనడాకు విస్తరించడం, వాణిజ్యాన్ని వైవిధ్యపరచాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ సదస్సును చేపట్టనున్నారు.

వాతావరణం, పర్యావరణం

వాతావరణ మార్పులు, పర్యావరణంపై ప్రస్తుతం ఉన్న అవగాహన ఒప్పందం కింద సహకారం మరింత దృఢంగా కొనసాగుతుండటాన్ని ఇరు దేశాల నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం భాగస్వామ్యానికి ఉన్న సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. శాస్త్ర విజ్ఞాన ఆధారిత సమగ్ర, సమానత్వంతో కూడిన వాతావరణ చర్యల పట్ల తమ ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం కోల్పోవడం, కాలుష్యం, పర్యావరణ వ్యవస్థ క్షీణత వంటి సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించేందుకు జరుగుతున్న ద్వైపాక్షిక ప్రయత్నాలను వారు కొనియాడారు. వాతావరణ మార్పుల తీవ్రతను తగ్గించడం, వాతావరణ అనుకూల విధానాలను అనుసరించటం, జీవవైవిధ్య సంరక్షణ, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని వారు అంగీకరించారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమయ్యే బలహీన వర్గాలకు అండగా నిలవడం, వారిలో తట్టుకునే శక్తిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు.

అంతర్జాతీయ స్వచ్ఛ ఇంధన వేదికలు

అంతర్జాతీయ సౌర కూటమిలో సభ్యత్వం పొందాలనే కెనడా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఇది స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించడం, వాతావరణ మార్పులపై పనిచేయటంలో కెనడాకు ఉన్న దృఢ నిశ్చయాన్ని చాటిచెబుతోంది. ఈ కూటమిలో కెనడా చేరడం వల్ల సౌర విద్యుత్ విస్తరణ, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ సహకారం మరింత బలోపేతం అవుతుందని.. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలకు ఇది ఎంతో మేలు చేస్తుందని ఇరు దేశాల నాయకులు పేర్కొన్నారు. ఐఎస్ఏ ద్వారా లభించే ఈ అదనపు సహకారం భారత్-కెనడా ద్వైపాక్షిక స్వచ్ఛ ఇంధన కార్యక్రమాలకు తోడ్పాటునందిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఇది ప్రపంచ ఇంధన పరివర్తనను వేగవంతం చేయటం, ఉమ్మడి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు.

ప్రపంచ జీవ ఇంధన కూటమిలో పూర్తి స్థాయి సభ్య దేశంగా తన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైన ప్రాథమిక పత్రాలపై కెనడా సంతకం చేయడాన్ని భారత్ స్వాగతించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సుస్థిర జీవ ఇంధనాల వినియోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇది జీవ ఇంధనాల సరఫరా గొలుసులు, ప్రమాణాలు, విస్తరణలో సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా పర్యావరణ సుస్థిరాభివృద్ధి ప్రమాణాలు, జీవన చక్ర ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య సమన్వయాన్ని ఇది మరింత మెరుగుపరుస్తుంది.

సుస్థిర వ్యవసాయం, పోషకాహార భద్రత

వ్యవసాయం, వ్యవసాయ ఆహార వ్యవస్థలలో భారత్, కెనడాల మధ్య పెరుగుతున్న పరస్పర సహకారాన్ని గుర్తించిన ఇరు దేశాల నాయకులు.. ఆహార భద్రత, వ్యవసాయ ఉత్పాదకత, దృఢత్వం కలిగిన సరఫరా గొలుసులను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధానంగా చెప్పారు. వ్యవసాయ సాంకేతికత, పరిశోధన, విలువ ఆధారిత ఆహార ఉత్పత్తి రంగాలలో సహకారం విషయంలో పెరుగుతున్న అవకాశాలను వారు ప్రస్తావించారు. లోతైన వ్యవసాయ భాగస్వామ్యం వల్ల సుస్థిర సాగు పద్ధతులు, పోషకాహార భద్రత, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం, పెట్టుబడులు మెరుగుపడతాయని నాయకులు అంగీకరించారు.

నిఫ్టెమ్ కుండ్లీలో 'కెనడా-ఇండియా పల్స్ ప్రోటీన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఇరు దేశాల నాయకులు స్వాగతించారు. పప్పుధాన్యాల ఉత్పత్తి, ఆవిష్కరణలలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కెనడాలోని సస్కట్చేవాన్ ప్రావిన్స్‌కు.. ప్రపంచంలోనే పప్పుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారు, వినియోగదారుగా ఉన్న భారత్‍కు మధ్య ఉన్న పరస్పర అనుబంధ బలాలను వారు గుర్తించారు. దీనివల్ల వ్యవసాయ-ఆహార పరిశోధనల్లో సహకారం పెరుగుతుందని.. పప్పుధాన్యాల నుంచి ప్రోటీన్ తయారీ చేయటం, బలవర్థకమైన ఆహారాన్ని అభివృద్ధి చేయాటానికి ఊతం లభిస్తుందని నాయకులు అంగీకరించారు. ఇది అందరికీ అందుబాటు ధరల్లో అధిక నాణ్యతతో కూడిన పోషణను అందించడమే కాకుండా ఇరు దేశాల మధ్య ప్రాంతీయ స్థాయి భాగస్వామ్యాలు, పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు.

ఒకే కుటుంబం

నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడి

భారత్, కెనడాల మధ్య ప్రజల సంబంధాలను పెంపొందించడంలో విద్య, ప్రతిభావంతుల రాకపోకలు కీలక పాత్ర పోషిస్తాయని ఇరు దేశాల నాయకులు పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, నిపుణుల రాకపోకలు రెండు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా ఆవిష్కరణల వ్యవస్థలు, ఆర్థిక వృద్ధిని బలోపేతం చేశాయని వారు పేర్కొన్నారు.

ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల మానవ వనరులను తయారుచేయటంలో అంతర్జాతీయ విద్యా సహకారానికి ఉన్న ప్రాముఖ్యతను నాయకులు గుర్తించారు. ఇందులో భాగంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణను మెరుగుపరచడం.. ఉమ్మడి డిగ్రీలు, డ్యూయల్ డిగ్రీలు, ట్విన్నింగ్ కార్యక్రమాలను విస్తరించడం..కెనడాలోని ప్రముఖ విద్యా సంస్థలు భారత్‌లో తమ విదేశీ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించటం.. వర్ధమాన సాంకేతికతలలో పరిశోధన భాగస్వామ్యాలను బలోపేతం చేయాలనిపై దృష్టి సారిస్తూ ఉన్నత విద్యా సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు వారు అంగీకరించారు. ఈ రంగంలో సహకారాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ఉన్నత విద్యపై 'జాయింట్ వర్కింగ్ గ్రూప్'ను పునరుద్ధరించాలని నాయకులు నిర్ణయించారు.

భారత్‌కు చెందిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), కెనడాకు చెందిన 'మైటాక్స్' (ఎంఐటీఏసీఎస్) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరు దేశాల నాయకులు స్వాగతించారు. దీని ద్వారా 'గ్లోబలింక్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్' కార్యక్రమాన్ని విస్తరించి ఏటా సుమారు 300 మంది భారతీయ డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేట్) విద్యార్థులు కెనడియన్ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం విద్యా సంస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేయటం, వివిధ విభాగాలలో విద్యా సంబంధిత సహకారాన్ని పెంపొందించటంతో పాటు ప్రత్యక్ష పరిశోధన, వృత్తిపరమైన శిక్షణ ద్వారా విద్యార్థులలో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల నైపుణ్యాలను పెంచుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

పరిశోధన, ఆవిష్కరణల రంగంలో 'జాయింట్ టాలెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ' అనే కొత్త వ్యూహాన్ని రూపొందించే ప్రతిపాదనను ఇరు దేశాల నాయకులు స్వాగతించారు. రెండు దేశాలకు ప్రాధాన్యతగా ఉన్న కీలక రంగాలలో కెనడా పరిశోధనా సామర్థ్యాన్ని అనుసంధానించడం.. వ్యవస్థీకరించిన రాకపోకలు, ఉమ్మడి శిక్షణ మార్గాలు, పరిశోధన సహకారం ద్వారా ఇరు దేశాల మధ్య ప్రతిభావంతుల రాకపోకలు మరింత బలోపేతం చేయాలన్నది దీని ప్రధాన ఉద్దేశం.

ఆవిష్కరణలను ప్రోత్సహించటం, సామర్థ్యాన్ని పెంపొందించటం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని ఉమ్మడి ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడానికి సంస్థాగత భాగస్వామ్యాలు, పరిశోధకుల రాకపోకలు, విజ్ఞాన మార్పిడి కీలకమని ఇరు దేశాల నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కెనడియన్, భారతీయ విద్యా సంస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా కెనడా ప్రవేశపెట్టిన 'ఇండో-పసిఫిక్ స్కాలర్‌షిప్స్ అండ్ ఫెలోషిప్స్ ఫర్ కెనడియన్స్' (ఐపీఎస్ఎఫ్‌సీ) కార్యక్రమాన్ని వారు స్వాగతించారు. ఈ కార్యక్రమం కింద 11 కెనడా ఉన్నత విద్యా సంస్థల నుంచి 85 మందికి పైగా డిగ్రీ విద్యార్థులు, పరిశోధకులు భారతదేశానికి రానున్నారు. వీరు స్వచ్ఛ హైడ్రోజన్, వాతావరణ దృఢత్వం, కృత్రిమ మేధ, వాణిజ్యం- సరఫరా గొలుసు దృఢత్వం, సుస్థిరాభివృద్ధి వంటి ప్రాధాన్యత రంగాలలో ప్రముఖ భారతీయ విద్యావేత్తలతో కలిసి పనిచేస్తారు. వీటితో పాటు విద్యా రంగానికి సంబంధించి 24 కొత్త అవగాహన ఒప్పందాలు కుదరడాన్ని కూడా నాయకులు అభినందించారు.

ప్రజల మధ్య అనుబంధం, సాంస్కృతిక సహకారం

భారత్, కెనడాల మధ్య ఉన్న లోతైన చారిత్రక సంబంధాలు, శక్తిమంతమైన ప్రజా అనుబంధాన్ని గుర్తించిన ఇరువురు నేతలు.. ద్వైపాక్షిక సంబంధాలలో సాంస్కృతిక సహకారం ఒక కీలకమైన స్తంభమని అన్నారు. నిరంతర సాంస్కృతిక మార్పిడి వల్ల పరస్పర అవగాహన పెరగటంతో పాటు వైవిధ్యం పట్ల గౌరవం పెంపొందుతూ సమాజాల మధ్య శాశ్వత బంధాలు ఏర్పడతాయని వారు పేర్కొన్నారు. ఇది సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలు, ఆవిష్కరణలకు కూడా తోడ్పడుతుందని వారు అన్నారు. ఇది సంస్కృతి, వారసత్వం, సృజనాత్మక పరిశ్రమల రంగాలలో సన్నిహిత సహకారం ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుసంపన్నం చేయటంతో పాటు సమగ్ర వృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు అర్థవంతంగా దోహదపడుతుందని నాయకులు అంగీకరించారు.

కళలు, వారసత్వం, దృశ్యశ్రవణ మీడియా, సంగీతం, సృజనాత్మక పరిశ్రమల రంగాలలో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్న 'సాంస్కృతిక సహకారం'పై అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఇరు దేశాల నాయకులు స్వాగతించారు. లక్షిత కార్యక్రమాల ద్వారా రెండు దేశాలలోని సాంస్కృతిక సంస్థలు, సృజనాత్మక కళాకారుల మధ్య సహకారాన్ని పటిష్ఠం చేసేందుకు వారు అంగీకరించారు.

సాంస్కృతిక రంగంలో వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, కృత్రిమ మేధ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల సామర్థ్యాన్ని ఇరు దేశాల నాయకులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిరంతర సాంస్కృతిక సంభాషణలను కొనసాగించడానికి, సృజనాత్మక భాగస్వామ్యాలను నెలకొల్పడానికి, ఈ రంగంలో పరస్పర అవగాహనను పెంపొందించడానికి ఈ సాంకేతికతలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు ప్రముఖంగా పేర్కొన్నారు.

రెండు దేశాల్లోని గిరిజన, స్థానిక వర్గాలను సాధికారత దిశగా నడిపించాల్సిన ప్రాముఖ్యతను ఇరు దేశాల నాయకులు పునరుద్ఘాటించారు. వారి సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు, దేశాభివృద్ధికి వారు అందిస్తున్న నిరంతర సహకారాన్ని నాయకులు గుర్తించారు. సాంస్కృతిక పరిరక్షణ, వ్యవస్థాపకత, సుస్థిర జీవనోపాధి రంగాలలో అంతర్జాతీయ మార్పిడిని ప్రోత్సహించడానికి 'భారత్ ట్రైబల్ ఫెస్టివల్ 2026' ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. సమగ్ర వృద్ధిని బలోపేతం చేయటం, విభిన్న సంస్కృతులు - సంప్రదాయాల పట్ల పరస్పర గౌరవంతో కూడిన ప్రజా సంబంధాలను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో సాంస్కృతిక మార్పిడి, నైపుణ్యాభివృద్ధి, సాంప్రదాయ విజ్ఞానం, గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించడం వంటి అంశాల్లో చర్చలు, సహకారాన్ని పెంచాలని నాయకులు అంగీకరించారు.

ఇటీవల జరిగిన 'భారత్-కెనడా ట్రాక్ II వ్యూహాత్మక చర్చల'ను ఇరు దేశాల నాయకులు స్వాగతించారు. విధాన నిర్ణేతలు, నిపుణులు, వ్యాపార వేత్తలు, పౌర సమాజ ప్రతినిధులు ఒకచోట చేరిన ఈ చర్చల్లో ఆర్థిక దృఢత్వం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఇంధన భద్రత, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో దౌత్యపరమైన సంబంధాల పునరుద్ధరణను క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక సహకారంగా మార్చే తీరుపై చర్చించారు. సంస్థాగత- వివిధ రంగాల మధ్య జరిగే సంభాషణలు, ఉమ్మడి విధానపరమైన చర్చల ప్రాముఖ్యతను ఈ ఉన్నత స్థాయి చర్చలు తెలియజేస్తున్నాయని.. ప్రభుత్వాల మధ్య జరిగే అధికారిక చర్చలను ఇవి మరింతగా ఉపయోగపడతాయని వారు అన్నారు. అధికారిక వేదికలు, ట్రాక్ II వేదికల ద్వారా నిరంతరం చర్చలు జరపడం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుందని, ద్వైపాక్షిక సహకారం బలోపేతం అవుతుందని.. రెండు దేశాల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందించే ప్రయోగాత్మక, భవిష్యత్ కార్యక్రమాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని నాయకులు అంగీకరించారు.

భారత్, కెనడాల మధ్య పౌర విమానయాన రంగంలో ఉన్న సుదీర్ఘ భాగస్వామ్య చరిత్రను.. ఆర్థిక వృద్ధికి, దేశాల మధ్య అనుసంధానానికి, ప్రజా సంబంధాలకు ఇది అందిస్తున్న విశేష సహకారాన్ని ఇరు దేశాల నాయకులు గుర్తించారు. రెండు దేశాలలో సురక్షితమైన, భద్రతతో కూడిన సుస్థిర, దృఢత్వం కలిగిన విమానయాన వ్యవస్థలను ప్రోత్సహించేందుకు వీలుగా 'పౌర విమానయాన సహకారం'పై ఉమ్మడి అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించే దిశగా పని చేయాలనే ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.

ఒకే భవిష్యత్తు

శాస్త్ర సాంకేతిక నిర్మాణం

ఆర్థిక వృద్ధి, పోటీతత్వం, సామాజిక సామర్థ్యాలకు సాంకేతికత, ఆవిష్కరణలు ప్రధాన చోదక శక్తిగా గుర్తించిన నేతలు... శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో భారత్-కెనడా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యాన్ని స్పష్టం చేశారు. ఆశయాన్ని సమన్వయంతో కూడిన, ఫలితాల ఆధారిత సహకారంగా మార్చగల సంస్థాగత యంత్రాంగాలను పునరుజ్జీవింపజేయవలసిన అవసరాన్ని ఈ కలయిక హైలైట్ చేస్తుంది. కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి... సురక్షితమైన, విశ్వసనీయ డిజిటల్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి... క్లీన్ టెక్, ఇంధన ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి... పరిశోధన భాగస్వామ్యాలను విస్తరించడం కోసం ఒక పునరుద్ధరించిన వేదికను అందించే దిశగా జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ కమిటీ (జేఎస్‌టీసీసీ) పునఃప్రారంభం కీలక ముందడుగు అవుతుంది.

అంతరిక్ష సహకారం

అంతరిక్ష సహకారంపై సంబంధిత ఏజెన్సీలు, ప్రైవేట్ రంగాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఆవశ్యకత, అది పరస్పర ప్రయోజనకరంగా ఉండడం గురించి నాయకులు చర్చించారు. 1996లో అంతరిక్ష సహకారం గురించిన అవగాహన ఒప్పందంపై మొదటిసారి సంతకం చేసినప్పటి నుంచి ఈ 30 సంవత్సరాల్లో కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (సీఎస్ఏ), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మధ్య పరస్పర నమ్మకం ఆధారంగా... అంతరిక్ష సంస్థలు, వాటి జాతీయస్థాయి వాణిజ్య, పరిశోధన వ్యవస్థలు వేగంగా, సమష్టిగా అభివృద్ధి చెందే అవకాశాలను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈ భాగస్వామ్యాన్ని ఎమ్‌వోయూ కింద ఒక ప్రతిష్టాత్మక అమలు ఒప్పందం ద్వారా మార్గనిర్దేశం చేస్తారు. ఇది వాతావరణ శాస్త్రాలు, అంతరిక్ష రోబోటిక్స్, మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలతో కూడిన అంతరిక్ష అన్వేషణ, క్వాంటం కమ్యూనికేషన్ టెక్నాలజీల వంటి కొత్త, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులను అమలు చేయడానికి, సాంకేతిక సహకారాన్ని సులభతరం చేయడానికి... వారి ఏజెన్సీల మధ్య మెరుగైన సామర్థ్య నిర్మాణం, విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా మద్దతునిస్తుంది. మరింత విస్తృతంగా, వారు తమ జాతీయ అంతరిక్ష వ్యవస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం... ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, అంకురసంస్థలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించడం... పరస్పర ప్రయోజనకరమైన సానుకూలతలను ఉపయోగించుకోవడం... ఆవిష్కరణలను కొనసాగించడం... భాగస్వామ్య అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పాటునందించాల్సిన ప్రాముఖ్యాన్ని ధ్రువీకరించారు.

డిజిటల్, ఏఐ సహకారం

అంతరిక్ష సహకారాన్ని పెంపొందించుకుంటూ, భారత్-కెనడాలు అంతరిక్షం, అంతరిక్ష సాంకేతికతల్లో ఏఐని అనుసంధానించే ఉమ్మడి కార్యక్రమాలను అన్వేషించాలని భావిస్తున్నాయి. అంతరిక్ష అనువర్తనాలు, భూమి పరిశీలన కోసం ఈ ఏఐ సాధనాలను సహ-అభివృద్ధి చేయడం ద్వారా, ఇరు దేశాలు ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లి తమ సాంకేతిక సార్వభౌమత్వాన్ని బలోపేతం చేసుకుంటాయి.

ఇరు దేశాల్లో మారుమూల ప్రాంతాలకూ ఆధునికమైన, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి దూర వైద్య రోగనిర్ధారణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఏఐ సహాయక సాధనాల విషయంలో సహకారాన్ని అన్వేషించడానికి నేతలు అంగీకరించారు.

పరిశ్రమ, విద్యా భాగస్వామ్యాల విలువను గుర్తిస్తూ... భారత ఇంజనీర్లు, పరిశోధకులు కెనడా ప్రపంచ స్థాయి ఏఐ పరిశోధనా సంస్థల్లో ఆచరణాత్మక అనుభవాన్ని పొందేందుకు, కెనడియన్ ఇంజనీర్లు డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థను పెద్ద ఎత్తున అమలు చేయడంలో భారత నైపుణ్యాన్ని పొందేందుకు వీలుగా సరిహద్దుల మధ్య పని-సమగ్ర అభ్యసన అవకాశాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి.
పెరుగుతున్న ఇంధన డిమాండ్, విస్తరిస్తున్న పునరుత్పాదక ఇంధన పాత్ర నేపథ్యంలో సమర్థమైన విద్యుత్ గ్రిడ్ వ్యవస్థల ప్రాముఖ్యాన్ని గుర్తించి, ఇంధన వినియోగంలో పెరుగుదలను అంచనా వేయడానికి, వివిధ వాతావరణ పరిస్థితుల్లో బ్యాటరీ నిల్వను మెరుగ్గా నిర్వహించడానికి ఇరు దేశాల్లో నమ్మకమైన, సమర్థమైన, వాతావరణ-సమర్థమైన విద్యుత్ వ్యవస్థలకు మద్దతునివ్వడానికి ఏఐ అల్గారిథంల అభివృద్ధిపై విజ్ఞాన-భాగస్వామ్యం ద్వారా సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

ఆస్ట్రేలియా-కెనడా-ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (ఏసీఐటీఐ) భాగస్వామ్యంలో పురోగతిని నేతలు స్వాగతించారు. న్యూఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సు సందర్భంగా మూడు దేశాల ఏఐ మంత్రుల ఇటీవలి సమావేశాన్ని వారు ప్రస్తావించారు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీలలో ఆచరణాత్మక త్రైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉమ్మడి పని ప్రణాళికను అభివృద్ధి చేయడానికి వారు అంగీకరించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ, అధిక-పనితీరు గల కంప్యూటింగ్, ఇంటర్నెట్-ఆఫ్-థింగ్స్ (ఐవోటీ), సైబర్ భద్రత, అంకురసంస్థల వ్యవస్థల్లో లోతైన సహకారం కోసం సామర్థ్యాన్ని స్పష్టం చేశారు. విశ్వసనీయ ఆవిష్కరణ వ్యవస్థలను ప్రోత్సహించడానికి... స్పష్టమైన ఫలితాలను అందించేందుకు ఏఐ సార్వభౌమత్వాన్ని, సమ్మిళితత్వాన్ని, అందుబాటులో ఉంచుటను, విశ్వసనీయతను పెంపొందించడానికి విధాన, నియంత్రణల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి... ఏఐ స్వీకరణను, సంబంధిత బిజినెస్-టు-బిజినెస్ భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి... నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ, విజ్ఞాన-భాగస్వామ్యం ద్వారా ఉమ్మడి సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి నేతలు అంగీకరించారు. సాంకేతికత, ఆవిష్కరణల్లో సహకారంపై ఆస్ట్రేలియా-కెనడా-ఇండియా దేశాలు త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ఈ పని క్రోడీకరణను నేతలు స్వాగతించారు.

ఈ ఉమ్మడి దృక్పథాన్ని నిర్దిష్ట ఫలితాలుగా అనువదించడానికి, పునరుద్ధరించిన భారత్-కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రెండు ప్రధాన అంశాల ఆధారంగా నిర్మించడానికి నేతలు అంగీకరించారు.
ప్రాథమిక స్థాయి – 1: భద్రత, రక్షణ సహకారం

భద్రతా సహకారం

జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో క్రమం తప్పకుండా జరిగే ద్వైపాక్షిక భద్రతా చర్చల ద్వారా సాధించిన పురోగతిని, జాతీయ భద్రత-చట్టాల అమలు ప్రాధాన్యాలపై సహకారాన్ని పెంపొందించడానికి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఒప్పందాన్ని నేతలు స్వాగతించారు. బహుళ ప్రజాస్వామ్య దేశాలుగా... హింసాత్మక తీవ్రవాదం, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాలు, ఫెంటానిల్ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, దోపిడీ, ఆర్థిక మోసం, అక్రమ రవాణా, సంబంధిత నేరాల నెట్‌వర్క్‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి వారు అంగీకరించారు. ద్వైపాక్షిక కమ్యూనికేషన్‌ను క్రమబద్ధీకరించడానికి, సకాలంలో సమాచార భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి భద్రత-చట్టాల అమలు అనుసంధాన యంత్రాంగాల ఏర్పాటుకూ నేతలు మద్దతునిచ్చారు. దేశీయ చట్టాలు, అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా సైబర్ భద్రత, ఇమ్మిగ్రేషన్ అమలుపై సహకారాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాద నిరోధకంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ తదుపరి సమావేశాన్ని సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలనీ వారు పిలుపునిచ్చారు.

రక్షణ సహకారం

ఆచరణాత్మక సైనిక సహకారాన్ని విస్తరించడం విలువను నేతలు గుర్తించారు. సహకార కార్యకలాపాలు, ఉమ్మడి శిక్షణ అవకాశాలు, వృత్తిపరమైన సైనిక సహకారం ద్వారా రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకునే అవకాశాలను స్వాగతించారు. రక్షణ సామగ్రి సహకారం, సమర్థమైన సరుకు రవాణా వ్యవస్థ, శిక్షణ-విన్యాసాల వంటి రంగాల్లో కొత్త సముద్ర భద్రతా భాగస్వామ్యాన్ని నేతలు స్వాగతించారు.

రక్షణ సహకారం పెంపొందించుకోవడానికి గల అవకాశాలను గుర్తించడానికి... సంబంధిత రక్షణ విధానాలు, ప్రాంతీయ, ప్రపంచ భద్రతా పరిణామాలు... వ్యూహాత్మక దృక్పథాలపై అభిప్రాయాలను పంచుకునే భారత్-కెనడా రక్షణ రంగ చర్చలను సంస్థాగతీకరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

ఈ సందర్భంలో, సంస్థాగత సంబంధాలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన చర్యలుగా భారత్‌కు డిఫెన్స్ అటాచ్‌ను కెనడా నియమించడాన్ని... అదే సమయంలో వాషింగ్టన్ డి.సి.లో భారత్ తన డిఫెన్స్ అటాచ్‌ను కెనడాకు అక్రిడిటేషన్ చేయడాన్ని వారు స్వాగతించారు.

బహుపాక్షిక, ఇండో-పసిఫిక్ భాగస్వామ్యం

ప్రాంతీయ, ప్రపంచస్థాయి వేదికల పరిధిలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ కార్యక్రమాలు సమన్వయాన్ని బలోపేతం చేస్తాయి. పెరుగుతున్న సంక్లిష్ట వ్యూహాత్మక వాతావరణంలో ప్రాధాన్యాలపై ఉమ్మడి అవగాహనను ప్రోత్సహిస్తాయి.

వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యం పెరుగుతున్న ప్రాంతంగా ఇండో-పసిఫిక్ ప్రాంతం నిలుస్తుందని నాయకులు అంగీకరించారు. స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో గల, సమ్మిళితమైన, సమర్థమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతం పట్ల ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతం అంతటా స్థిరమైన అభివృద్ధి, సముద్ర భద్రత, రక్షణ, వాతావరణ సమర్థత, కనెక్టివిటీ, సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహించడంలో ఆచరణాత్మక సహకారం విలువనూ వారు స్పష్టం చేశారు. ప్రాంతీయ, ప్రపంచస్థాయి సంస్థలు, భాగస్వామ్యాల ద్వారా సమన్వయాన్ని బలోపేతం చేయడానికి... మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సమ్మిళితత్వం, విపత్తు సంసిద్ధత, ప్రజా కేంద్రిత వృద్ధికి మద్దతునివ్వడానికి పరస్పర ప్రయోజనకరమైన సానుకూలతలను ఉపయోగించుకోవడానికి... సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించే నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లు నేతలు ప్రకటించారు.

స్థిరత్వం, స్థిరమైన అభివృద్ధి, కనెక్టివిటీ, సమ్మిళిత వృద్ధిలో ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా హిందూ మహాసముద్ర ప్రాంతం పట్ల భారత్ దార్శనికత, కెనడా అనుసరిస్తున్న ఇండో-పసిఫిక్ వ్యూహం మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని నేతలు గుర్తించారు. నౌకా వాణిజ్య నిర్వహణ, వాతావరణ సమర్థత, నీలి ఆర్థిక వ్యవస్థ, సామర్థ్య నిర్మాణంలో కెనడా తన నైపుణ్యం ద్వారా తీసుకురాగల విలువను గుర్తిస్తూ... చర్చా భాగస్వామిగా ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐవోఆర్ఏ)లో చేరడం పట్ల కెనడా ఆసక్తిని భారత్ స్వాగతించింది. విపత్తు సంసిద్ధత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సమ్మిళితత్వం, ప్రజా కేంద్రిత వృద్ధికి మద్దతునిచ్చే ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా హిందూ మహాసముద్రంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి నేతలు అంగీకరించారు. స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో గల, సమ్మిళితమైన, సమర్థమైన ఇండో-పసిఫిక్‌ను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రాంతీయ భాగస్వాములతో కలిసి పనిచేయడం పట్ల నిబద్ధతను వారు ధ్రువీకరించారు.

మూలాధారం – 2: వాణిజ్య భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం

వాణిజ్యం, పెట్టుబడులపై మంత్రుల స్థాయి చర్చలు

వాణిజ్యం, పెట్టుబడులపై పునరుద్ధరించిన మంత్రుల స్థాయి చర్చలు... ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను పునరుద్ధరించడం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, పెరుగుతున్న ఆర్థిక పరస్పర ప్రయోజనాలతో ముడిపడిన సహకారం కోసం భవిష్యత్తు ఆధారిత ఎజెండాను రూపొందించడం లక్ష్యంగా ఒక కొత్త దశను గుర్తించినట్లు నేతలు తెలిపారు.

సీఈపీఏ, వాణిజ్య నిర్మాణం

ప్రతిష్టాత్మకమైన, పరస్పర ప్రయోజనకరమైన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) దిశగా చర్చలను తిరిగి ప్రారంభించడం ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం పట్ల తమ ఉమ్మడి నిబద్ధతను నేతలు పునరుద్ఘాటించారు. సమగ్ర వాణిజ్య విధాన ప్రణాళిక... ఇరు దేశాల భాగస్వామ్యానికి మన్నికైన ఆర్థిక ఆధారంగా పనిచేస్తుందని, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సీఏడీ 70 బిలియన్ అంటే రూ. 4.65 లక్షల కోట్లకు విస్తరించాలనే ఉమ్మడి ఆకాంక్షకు మద్దతునిస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. సీఈపీఏ చర్చల కోసం నిబంధనలు ఖరారు చేయడం, సంతకాలు చేయడం, అధికారిక చర్చలను ప్రారంభించడాన్ని వారు స్వాగతించారు. 2026 చివరి నాటికి చర్చలను విజయవంతంగా ముగించడం పట్ల ఉమ్మడి నిబద్ధతను వారు వ్యక్తం చేశారు.

వాణిజ్యం వేగవంతం

అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక దృశ్యాన్ని అంగీకరిస్తూ... సరుకు రవాణా స్థిరత్వాన్ని పెంచే, బాహ్య దుర్బలత్వాలను తగ్గించే, ఒకరి సున్నితత్వాలను మరొకరు సర్దుబాటు చేసుకునే, ప్రాధాన్య రంగాల్లో పరస్పరం ప్రయోజనకరమైన సహకారాన్ని ప్రోత్సహించే సమర్థమైన, విశ్వసనీయమైన, అంచనా వేయదగిన వాణిజ్య సంబంధాల ప్రాముఖ్యాన్ని ఇరుపక్షాలు స్పష్టం చేశాయి. భారత్‌లో పనిచేస్తున్న కెనడియన్ కంపెనీలు... కెనడాలో పనిచేస్తున్న భారతీయ కంపెనీలు నియమించిన గణనీయ శ్రామిక శక్తిలో ప్రతిబింబించే వారి ఆర్థిక వ్యవస్థల లోతైన ఏకీకరణను వారు గుర్తించారు. ఇప్పటికే భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న ఇరు-మార్గాల వాణిజ్య ఉనికిని ఇది ప్రదర్శిస్తుంది.

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలకు మరింత వాణిజ్య ఊపును అందించడానికి... నాయకులు వ్యాపార ప్రతినిధులతో కలిసి ఇరు దేశాల మంత్రుల నేతృత్వంలో రెండు కెనడా పర్యటనలు, రెండు భారత్ పర్యటనలతో కూడిన నాలుగు పరస్పర పర్యటనలు భాగంగా ఉండే వాణిజ్య, పెట్టుబడి కార్యక్రమాల కార్యక్రమాన్ని స్వాగతించారు. ఈ పర్యటనలు కొత్త వాణిజ్య అవకాశాలను పెంపొందించడానికి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాలను మరింతగా విస్తరించడానికి, ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను మరింత ఏకీకృతం చేయడానికి సహాయపడతాయని వారు గుర్తించారు.

ఇండియా-కెనడా సీఈవోల ఫోరం

ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి, ప్రాధాన్య రంగాల్లో ఆచరణాత్మక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కీలకమైన వేదికగా ఇండియా-కెనడా సీఈవోల ఫోరం పునర్నిర్మాణాన్ని నాయకులు స్వాగతించారు. సమర్థమైన వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణ, సరుకు రవాణా వ్యస్థల్లో కొత్త అవకాశాలను గుర్తించడానికి... సీఈపీఏ చర్చలు, విస్తృత ఆర్థిక లక్ష్యాలకు మద్దతునివ్వడానికి కార్యాచరణ సిఫార్సులను అందించాలని ఇరు దేశాల వ్యాపార దిగ్గజాలను వారు ప్రోత్సహించారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి... ఇరు దేశాల్లోని వాణిజ్యం, పౌరులకు స్పష్టమైన ప్రయోజనాలను అందించడానికి పరిశ్రమ, ప్రభుత్వం, ఆర్థిక సంస్థల మధ్య బలమైన సహకారం అవసరమని నాయకులు అంగీకరించారు.

ఆర్థిక మంత్రుల ఆర్థిక చర్చలు

చెల్లింపుల ఆధునికీకరణ, ఆర్థిక స్థిరత్వం, ఫిన్‌టెక్ ఆవిష్కరణ, మూలధన మార్కెట్ల అభివృద్ధి వంటి అంశాలపై ఆర్థిక రంగ అధికారులను ఒకచోట చేర్చే ఆర్థిక మంత్రుల ఎకనమికల్-ఫైనాన్షియల్ చర్చలను ప్రారంభించడాన్ని నేతలు స్వాగతించారు. ముందస్తు ప్రాధాన్యంగా, తక్షణ చెల్లింపుల భవిష్యత్తు విషయంలో సహకారం, దేశాల మధ్య చెల్లింపులు, వ్యాపారులకు చేసే చెల్లింపులపై అవకాశాలను అన్వేషిస్తారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడం, రెండు దేశాల్లో పర్యాటకం, విద్య, చెల్లింపులు, ఎస్ఎమ్ఈల వృద్ధికి మద్దతునివ్వడం లక్ష్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పేమెంట్స్ కెనడాలను పాల్గొనడానికి ఆహ్వానించారు. తొలి ఆర్థిక మంత్రుల ఎకనమిక్ డైలాగ్ 2026లో పరస్పర అంగీకారం గల సమయంలో నిర్వహిస్తామని వారు తెలిపారు.

ముగింపు

భారత ప్రభుత్వానికి, ప్రజలకు అలాగే వారి హృదయపూర్వక ఆతిథ్యానికి ప్రధానమంత్రి కార్నీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమగ్ర భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కెనడా బలమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఇరువురు నేతలు నిరంతర ఉన్నత స్థాయి భాగస్వామ్యాన్ని స్వాగతించారు. ఈ సంయుక్త ప్రకటనలో పేర్కొన్న కార్యక్రమాలు భారత్-కెనడా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతాయని, పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయని, ఇరు దేశాలతో పాటు వారి ప్రజలకు ప్రత్యక్ష, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు

.బలమైన భారత్-కెనడా భాగస్వామ్యం ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ సమర్థత, ఉమ్మడి శ్రేయస్సుకు సానుకూలంగా దోహదపడుతుందని... మరింత సమ్మిళితమైన, స్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తును నిర్మించాలనే తమ ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని వారు తెలిపారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Ayushman Bharat Crosses 90 Cr ABHA Accounts: How Modi govt is building the world’s largest digital health ecosystem

Media Coverage

Ayushman Bharat Crosses 90 Cr ABHA Accounts: How Modi govt is building the world’s largest digital health ecosystem
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the qualities of an ideal teacher
June 01, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that some people are highly skilled at performing a task themselves, while others are particularly adept at imparting that knowledge or skill to others. He noted that a person who possesses both these qualities-self-mastery and the ability to teach others-deserves to be regarded among the finest of teachers.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“श्लिष्टा क्रिया कस्यचिदात्मसंस्था सङ्क्रान्तिरन्यस्य विशेषयुक्ता।

यस्योभयं साधु स शिक्षकाणां धुरि प्रतिष्ठापयितव्य एव।। ”

The Subhashitam conveys that while some excel in practice and others in teaching, the one who combines both mastery of a subject and the ability to effectively impart it to others is worthy of being placed in the foremost rank of teachers.

The Prime Minister wrote on X;

“श्लिष्टा क्रिया कस्यचिदात्मसंस्था सङ्क्रान्तिरन्यस्य विशेषयुक्ता।

यस्योभयं साधु स शिक्षकाणां धुरि प्रतिष्ठापयितव्य एव।।”