జనవరి 14న భారత వాతావరణ విభాగం 150వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరుకానున్న ప్రధానమంత్రి
January 13th, 11:14 am
భారత వాతావరణ విభాగం (ఐఎండి) 150వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో జనవరి 14న ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ను ‘వాతావరణ సంసిద్ధ-వాతావరణ సాంకేతిక’ దేశంగా రూపొందించే ధ్యేయంతో రూపొందించిన ‘మిషన్ మౌసమ్’ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అత్యాధునిక వాతావరణ పరిశీలన సాంకేతిక పరిజ్ఞానాలు-వ్యవస్థలతోపాటు అధిక సాంద్రతగల వాతావరణ విశ్లేషణ చిత్రాలు, భవిష్యత్తరం రాడార్లు-ఉపగ్రహాల రూపకల్పన సహా అధిక సామర్థ్యంగల కంప్యూటర్ల తయారీ వంటి లక్ష్యాల సాధన ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే వాతావరణం-సంబంధిత అంచనా ప్రక్రియలపై అవగాహన మెరుగుదల, దీర్ఘకాలిక వాతావరణ నిర్వహణ, కార్యకలాపాల వ్యూహాత్మక రూపకల్పనలో తోడ్పడే వాయు నాణ్యత సమాచార సేకరణపైనా ‘మిషన్ మౌసమ్’ దృష్టి సారిస్తుంది.